ఒకేచోట మూడువేల ఎకరాలు, ఏడాదిలోనే డిగ్రీపూర్తి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్టుతో టిడిపికి చిక్కులు
ఏపీకి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై హైద్రాబాద్ నగరంలో పలు భూ కబ్జాకేసులున్నాయి.2012 ఎన్నికల్లో రాయదుర్గం నుండి పోటీచేసే సమయానికి ఆయన డిగ్రీ పూర్తి చేయలేదు.
హైదరాబాద్:ఏపీకి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై హైద్రాబాద్ నగరంలో పలు భూ కబ్జాకేసులున్నాయి.2012 ఎన్నికల్లో రాయదుర్గం నుండి పోటీచేసే సమయానికి ఆయన డిగ్రీ పూర్తి చేయలేదు. అయితే ఏడాది కాలంలోనే ఆయన డిగ్రీ పాసైనట్టు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
హైద్రాబాద్ నగరంలో పలు భూ కబ్జాలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. అంతేకాదు కేసులు కూడ నమోదయ్యాయి.రాయదుర్గం నుండి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని భావించారు. అయితే ఈ స్థానం నుండి టిడిపి నాయకత్వం కాలువ శ్రీనివాసులును బరిలోకి దింపింది.
రాయదుర్గం స్థానాన్ని కాలువ శ్రీనివాసులుకు కేటాయించినందున ఎమ్మెల్సీగా టిడిపి దీపక్ రెడ్డికి కట్టబెట్టింది.హైద్రాబాద్ నగరంలోని పలుచోట్ల విలువైన స్థలాలపై దీపక్ రెడ్డి కన్నేశాడని పోలీసులు చెబుతున్నారు. విలువైన భూములను తప్పుడు పత్రాలతో దీపక్ రెడ్డి కబ్జా చేశారని పోలీసులు చెబుతున్నారు.
అయితే ఈ ఆరోపణలను దీపక్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాదు తనపై కుట్రపన్ని ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపణలు గుప్పించారు.అంతేకాదు వాస్తవాలను త్వరలోనే బయటకు వస్తాయన్నారు దీపక్ రెడ్డి.
ఏడాదిలోనే డిగ్రీ పూర్తి
2012 లో రాయదుర్గం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో దీపక్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీచేశారు.ఏడాదిలోనే డిగ్రీపాసైనట్టు దీపక్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. హైద్రాబాద్ నగరంలో పలు విలువైన స్థలాలను దీపక్ రెడ్డి ఆయన అనుచరులు కబ్జాచేశారని పోలీసులు చెబుతున్నారు. నకిలీ పత్రాలను సృష్టించి భూములను ఆక్రమించుకోవడం దీపక్ రెడ్డి ఆయన గ్యాంగ్ పనిగా పోలీసులు చెబుతున్నారు. హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు హైద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో దీపక్ రెడ్డికి లక్షల విలువైన స్థలాలున్నట్టు అధికారలు గుర్తంచారు. దొంగపత్రాలను సృస్టించి ఎన్నో ప్రభుత్వ భూములను కాజేసినట్టు రెవిన్యూ అధికారులు చెబుతున్నారు.
విలువైన భూములు
ఒకేచోట దీపక్ రెడ్డికి 3 వేల 128 ఎకరాల భూమి ఉందని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసిన సమయంలో 6 వేల781 కోట్ల ఆస్తులున్నాయని ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. శంషాబాద్ మండలంల కొత్వాల్ గూడలో అతనికి విలువైన మూడు ఎకరాలకు పైగా భూములున్నాయి. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో అత్యంత ఖరీదైన 8084 చదరపు అడుగుల అదేరోడ్ లో అతని భార్యకు 13,224 చదరపు అడుగుల స్థలం ఉంది.
బెంగుళూరులో కూడ స్థలాలు
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో దీపక్ రెడ్డికి 840 గజాలస్థలం, బెంగుళూరులో అతని భార్యకు అత్యంత విలువైన 2400 గజాల స్థలం ఉంది, జూబ్లిహిల్స్ లోనూ అతని భార్య పేరుతో 7 కోట్లకుపైగా విలువచేసే 16 వేల చదరపు అడుగుల వాణిజ్య స్థలం ఉంది. దీపక్ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపు, దౌర్జన్యానికి పాల్పడినట్టు ఐపిసి 506, ఐపిసి 447 సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి.
దీపక్ రెడ్డిపై కేసులతో టిడిపికి చిక్కులు
ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూకబ్జాలతో అరెస్టు కావడంతో టిడిపి నాయకత్వానికి ఇబ్బందులు తలెత్తాయి. భూ కుంభకోణాలకు వ్యతిరేకంగా తెలంగాణ టిడిపి నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆందోళనలకు కూడ సిద్దమయ్యారు. అదే సమయంలో ఏపీకి చెందిన టిడిపి ఎమ్మెల్సీ ఇదే భూ కుంభకోణంలో అరెస్టు కావడం ఆ పార్టీకి చిక్కులను తెచ్చిపెట్టింది.సిబిఐ సోదాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీని పార్టీ నుండి సస్పెండ్ చేసింది టిడిపి. అయితే దీపక్ రెడ్డి విషయంలో టిడిపి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.