నిజాలన్నీ బయటపెడతా: కబ్జా కేసుపై దీపక్ రెడ్డి, స్వీట్లు పంచుకున్న బోజగుట్టవాసులు
తనపై భూకబ్జా కేసు పెట్టిన అంశంపై టిడిపి ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పందించారు. ఆయనను బుధవారం కోర్టులో హాజరుపరిచిన అనంతరం, చంచల్ గూడ జైలుకు తరలించే సమయంలో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: తనపై భూకబ్జా కేసు పెట్టిన అంశంపై టిడిపి ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పందించారు. ఆయనను బుధవారం కోర్టులో హాజరుపరిచిన అనంతరం, చంచల్ గూడ జైలుకు తరలించే సమయంలో మీడియాతో మాట్లాడారు.
జేసీ అల్లుడు దీపక్ రెడ్డి భూదందాలో షాకింగ్ నిజాలు
తనపై తప్పుడు కేసు బనాయించారని దీపక్ రెడ్డి అన్నారు. కాగితాలపై తన సంతకం లేదని చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే తన సంతకమా కాదా అనేది తేలుతుందని చెప్పారు. కనీసం అది చెక్ చేయకుండా కేసు పెట్టారన్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నారు.
తాను త్వరలో నిజాలు అన్నింటినీ బయటపెడతానని దీపక్ రెడ్డి చెప్పారు. దయచేసి ఓపిక పట్టాలని మీడియాతో అన్నారు. కాగా, డాక్యుమెంట్లపై మీ సంతకం టాలీ అయిందని చెబుతున్నారని మీడియా ప్రశ్నించగా.. ఎవరు చెప్పారు, లేదు అన్నారు.
బోజగుట్ట వాసుల సంబరాలు
దీపక్ రెడ్డి అరెస్టుతో బోజగుట్ట వాసులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. ఈ రోజు శుభదినమని చెప్పారు. బోజగుట్ట వాసులను ఆయన ఇబ్బంది పెట్టారని, తగిన శిక్, పడిందని ధ్వజమెత్తారు.
ఇంకా దర్యాఫ్తు పూర్తి కాలేదు... సిసిఎస్ డీసీపీ
ఈ కేసు దర్యాఫ్తు ఇంకా పూర్తి కాలేదని సిసిఎస్ డిసిపి జోగయ్య వెల్లడించారు. బోజగుట్టలో చనిపోయిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. నకిలీ వ్యక్తుల పేరు మీద కేసులు వేసేవారని తెలిపారు. 100 ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు.
కేసులో కొందరి పాత్ర
ఈ కేసులో ఇంకా కొందరి పాత్ర ఉందని సిసిఎస్ డిసిపి తెలిపారు. అక్రమాలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడయిందన్నారు. బంజారాహిల్స్లో మూడు ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్నారు. అగ్రిమెంట్లు అన్నీ తప్పుడివి అని తేలిందని చెప్పారు. వీరిపై సైబరాబాదులోను కొన్ని కేసులు ఉన్నాయన్నారు.
చంచల్ గూడ జైలుకు తరలింపు
దీపక్ రెడ్డి, ఆయనకు సహకరించిన న్యాయవాది శైలేంద్ర సక్సేనాను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. బంజారాహిల్స్, ఆసిఫ్నగర్లో రూ.165కోట్ల విలువైన భూఅక్రమాలకు పాల్పడ్డారని దీపక్రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి.