టీఆర్ఎస్ పార్టీలో వలసల గుబులు.. ఫిరాయింపులకు చెక్ పెట్టేందుకు రంగంలోకి కేటీఆర్
టిఆర్ఎస్ పార్టీలో వలసల గుబులు పట్టుకుంది. ఎప్పుడు ఎవరు పార్టీని వీడి గులాబీ అధినేత కెసిఆర్ కు షాక్ ఇస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పార్టీని వీడుతున్న నేతల తీరుతో టిఆర్ఎస్ పార్టీ వీక్ అయిందన్న చర్చ జరుగుతుంది. వరుసగా ఒక్కొక్కరూ టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి, పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండడంతో, ప్రజల్లోకి వ్యతిరేక భావం వెళుతుందన్న అనుమానంతో మంత్రి కేటీఆర్ దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగారు. పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడానికి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
గులాబీ పార్టీలో పెరుగుతున్న అసమ్మతి.. కారు దిగుతున్న నేతలు
అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల కాలంలో సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టిఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల పలువురు కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం గులాబీ పార్టీలో గుబులు రేపింది. మొన్నటికి మొన్న మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న నల్లాల భాగ్యలక్ష్మి తో పాటు ఆమె భర్త చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
ఇక తాజాగా దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి పీజీఆర్ కుమార్తె గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
గులాబీ అధినాయకత్వానికి వలసలపై ఆందోళన
ఇక నిన్నటికి నిన్న తాజాగా ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తో పాటు కరకగూడెం జడ్పీటీసీ కాంతారావు అధికార పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. వారు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. వరుసగా పార్టీలో కారు దిగుతున్న నేతల సంఖ్య పెరుగుతూ ఉండడం పార్టీ అధినాయకత్వానికి ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈ క్రమంలోనే మరికొందరు సీనియర్ నాయకులు పార్టీలో తీవ్ర అసహనంతో కారు దిగేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.
ఖమ్మం, మహబూబ్ నగర్ లలో పార్టీ మారే ఆలోచనలో నేతలు
టీఆర్ఎస్ సీనియర్ నేత కనీస వేతనాలు అమలు బోర్డు చైర్మన్ సామ వెంకట్ రెడ్డి కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఖమ్మం జిల్లాలోని పలువురు సీనియర్ నాయకులు మహబూబ్ నగర్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే అధిష్ఠానం అప్రమత్తమైంది. అసమ్మతి నేతలపై ప్రత్యేకమైన దృష్టిసారించింది.
రంగంలోకి మంత్రి కేటీఆర్.. బుజ్జగించే ప్రయత్నాలు
అసమ్మతి నేతలను బుజ్జగించడం కోసం స్వయంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా పార్టీలోని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలమూరు కు చెందిన మాజీ మంత్రి పల్లి కృష్ణా రావు తో కేటీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిరువురూ టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పర్యటన సందర్భంగా కేటీఆర్ వారిని కలిసి, వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది.
టీఆర్ఎస్ లో అసమ్మతిని బాగా వాడుకుంటున్న కాంగ్రెస్
ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీలో మొదలైన అసమ్మతి పార్టీలోని నాయకులకు గుబులు పెంచుతుండగా, ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ పై అసమ్మతి అవకాశాన్ని మరింత ఉపయోగించుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఈ విషయంలో బిజెపి కంటే దూకుడుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా ప్రధానంగా కనిపిస్తుంది.