పార్టీ ఫిరాయించిన వారంతా బిచ్చగాళ్ళు .. ప్రజాక్షేత్రంలో అవమానించండి అన్న కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కేంద్రమాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు . కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్న వారంతా యాచకులు అంటూ ఆయన ఫైర్ అయ్యారు .
గాంధీభవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభినందన సభలో పాల్గొన్న ఆయన పార్టీ ఫిరాయింపులు సరికాదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే గెలిచాక పార్టీ మారటం ప్రజలకు, అవకాశం ఇచ్చిన పార్టీకి ద్రోహం చెయ్యటమే అని ఆయన మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన వారు బిచ్చగాళ్లతో సమానం అని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి .
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రజల మధ్యలో అవమానించాలని సూచించారు.ఇక ఫిరాయింపుదారులు కాంగ్రెస్ పార్టీ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇకపోతే లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటింగ్ నమోదైందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని జైపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు.