అమ్మానాన్నా.. నన్ను క్షమించండి: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. అమ్మా, నాన్నా... నన్ను క్షమించండంటూ సూసైడ్ నోట్ రాసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం వెలుగు చూసింది.
మహబూబ్నగర్ జిల్లా కోడంగల్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన మీర్జాపురం రాఘవేందర్ (20) తాండూరు పట్టణంలోని సింధూ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. డిగ్రీ చదువుతూనే అతను హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
ఇంటి వద్దే ఉండి చదువుకోవాలని తల్లిదండ్రులు చెప్పినా వినకుండా పని చేసుకుంటూ చదువుకుంటానని చెప్పి ఈ ఆదివారంనాడు ఇంట్లో నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు. గురువారం తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తు వివరాలు బయటకు వచ్చాయి. అతని జేబులో అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి అని రాసి ఉన్న బుక్ లభించింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని పోీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.