కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు: ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’లో 6న హాజరు కావాలి
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. 160 సీఆర్పీసీ కింద ఈ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కేవలం వివరణ కోసం మాత్రమే నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది.
ఢిల్లీ, హైదరాబాద్ ఎక్కడైనా హజరుకావచ్చని సీబీఐ పేర్కొంది. డిసెంబర్ 6న హైదరాబాద్లో విచారణకు కవిత హాజరుకానున్నారు. సీబీఐ నోటీసులు అందినట్లు కవిత ధృవీకరించారు. ఈ నెల 6న హైదరాబాద్లోని తన నివాసంలోనే ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతానని సీబీఐకి కవిత సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమె నుంచి సీబీఐ పలు వివరాలు ఆరా తీసే అవకాశం ఉంది. అయితే, లిక్కర్ స్కాంను విచారిస్తున్న ఈడీ నుంచి కాకుండా సీబీఐ నుంచి కవితకు నోటీసులు రావడం గమనార్హం.
కాగా, లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో ఇటీవలే కవిత పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి విచారణకైనా హాజరవుతామని, సమాధానం చెబుతామని కవిత ఇప్పటికే పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. ఎన్నికలున్న రాష్ట్రంలోకి మోడీ కంటే ముందు ఈడీ, సీబీఐలు వస్తాయని విమర్శించారు.
లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో కవిత పేరు
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు.
సౌత్ గ్రూప్ను శరత్ రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లు విజయ్ నాయర్ కు చేరాయని తెలిపింది. ఈ విషయాన్ని అమిత్ అరోరా ధృవీకరించారని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో సంబంధం ఉన్న మొత్తం 36 మంది 170 ఫోన్లు ధ్వంసం చేశారు. వాటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు 33 ఫోన్లు ధ్వంసం చేశారు. ధ్వంసమైన ఫోన్ల విలువ రూ. 138 కోట్లు. వాటిలో కవితకు చెందినవి 2 నెంబర్లు, 10 ఫోన్లు ఉన్నాయి. కవిత వాడిన 10 ఫోన్ల ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారు అని ఈడీ అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకు ఈడీ ఎదుట అమిత్ అరోరా 22 సార్లు హాజరయ్యారని, ఫోన్ ద్వారా కూడా సమాచారం తీసుకున్నారని అమిత్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 22 సార్లు ప్రశ్నించిన తర్వాత అమిత్ కస్టడీ అవసరం ఏంటని ఈ సందర్భంగా కోర్టు ఈడీని ప్రశ్నించింది.
అయితే, మూడు సార్లు మాత్రమే వాంగ్మూలం నమోదు చేశామని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగింపు కోసమే కస్టడీ కోరుతున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఆమె పేరు రావడం సంచలనంగా మారింది.