ఢిల్లీ వెళ్లిన కేసీఆర్: రెండ్రోజులు అక్కడే బస, మోడీ, అమిత్ షాతో భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన దేశ రాజధానికి బయల్దేరారు. రెండు రోజులపాటు ఆయన అక్కడే మకాం వేయనున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ శర్మ ఇంట్లో జరగనున్న వివాహ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు.
అంతేగాక, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్రమంత్రులతోనూ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలపై వారితో ఆయన చర్చించే అవకాశం ఉంది.
డీజీపీకి మంత్రి సబితా లేఖ
డీజీపీ మహేందర్ రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాశారు. విద్యార్థినులకు ఆత్మరక్షణ మెలకువలు నేర్పేందుకు షీటీమ్స్ ద్వారా ఏర్పాట్లు చేయాలని ఆ లేఖలో మంత్రి సూచించారు. విద్యార్థినులపై దాడులు జరగకుండా.. సమస్యను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అవగాహన కల్పించాలన్నారు.
ఆపదలో ఎవరిని ఆశ్రయించాలనే విషయంపై వారిని చైతన్యపర్చాలని.. హెల్ప్ లైన్లపై విద్యార్థినులకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. మహిళలు, విద్యార్థునులు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులపైనా పోలీసులు స్పందించాలని డీజీపీకి రాసిన లేఖలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావించారు.