ప్రపంచ తెలుగు మహాసభల్లో విందు.. భలే పసందు, నోరూరిస్తున్న తెలంగాణ వంటకాలు
హైదరాబాద్లో కొనసాగుతోన్న ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ సర్కారు చేసిన భోజన ఏర్పాట్లు నోరూరిస్తున్నాయి. అతిథులను, ఆహ్వానితులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
హైదరాబాద్: హైదరాబాద్లో కొనసాగుతోన్న ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ సర్కారు చేసిన భోజన ఏర్పాట్లు నోరూరిస్తున్నాయి. అతిథులను, ఆహ్వానితులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు మహాసభలకు వచ్చిన వారు విందు భోజనాన్ని తింటూ తెలుగు రుచి భళా అంటూ కితాబిచ్చారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సభలకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో భోజనాల నిర్వహణ జరుగుతోంది.
అదరగొడుతున్న తెలంగాణ ఘుమఘుమలు...
తెలుగు భాషా వైభవాన్ని చాటేలా అంగరంగ వైభవంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ మహాసభల్లో తెలంగాణ ఘుమఘుమలు అదరగొడుతున్నాయి. లాల్బహుదూర్ మైదానంలో హోటళ్ల నిర్వాహకులు స్టాళ్లను ఏర్పాటుచేసి అతిథుల జిహ్వాచాపల్యాన్ని తీరుస్తున్నారు.
భోజన ఏర్పాట్లు పరిశీలించిన ఈటెల...
రెండోరోజైన శనివారం.. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతోన్న హైదరాబాద్లోని ఎల్బీస్టేడియం, రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయం, లలిత కళా తోరణంలో భోజన ఏర్పాట్లను మంత్రి ఈటెల రాజేందర్ పలువురు అధికారులతో కలిసి పరిశీలించి, విందు భోజనం రుచి చూశారు.
వంటకాలన్నీ అదరహో...
పెళ్లి భోజనం తరహాలో వండి వడ్డించడం సాహితీ ప్రియులందరికీ మంచి అనుభూతినిచ్చింది. వెజ్ బిర్యానీ, పట్టువడియాల పులుసు, వంకాయ బగారా, బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు, చింతకాయ, పండుమిర్చిల చట్నీ, దొండకాయ పచ్చడి, పచ్చిపులుసు, టమోటా రసం, చింతపండు పులిహోర, పిండివంటల రుచి అదరహో అనిపిస్తున్నాయి.
నోరూరించే సమోసాలు...
సాధారణంగా మనం ఉల్లిగడ్డ, ఆలుగడ్డతో తయారైన సమోసాలను రుచి చూస్తుంటాం. కానీ.. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సంప్రదాయ రుచుల్లో నిజాం స్టాల్ వద్ద స్టాల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కోడికూర సమోసా, రొయ్య సమోసా, ఉల్లిగడ్డ సమోసా, మొక్కజొన్న సమోసా, తీజ్ సమోసా, చాక్లెట్ సమోసాలు సందర్శకుల్ని కట్టిపడేస్తున్నాయి.