కేసీఆర్కు జనగామ చిక్కు: టిఆర్ఎస్లోనే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
వరంగల్: జిల్లాల ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తలనొప్పులు తీసుకు వచ్చేలాగా కనిపిస్తోంది. పలుచోట్ల కొత్త జిల్లాల కోసం ఆందోళన కొనసాగుతోంది. జనగామ జిల్లా కోసం మాత్రం ఉద్యమం తీవ్రంగా జరుగుతోంది.
శుక్రవారం నాడు ఇది హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. ప్రత్యేక జనగామ జిల్లా డిమాండ్ కోసం ఈ రోజు పెద్ద సంఖ్యలో జనాలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా పోలీసు, ఆర్టీసీ, ఇతర వాహనాలను కొందరు ధ్వంసం చేశారు.
కొత్తగా 14 జిల్లాలు: ఎందుకో చెప్పిన కేసీఆర్, హడావుడిగా రాజ్భవన్కు..!
ఈ ఘటనలో దాదాపు ఇరవై ముప్పై వాహనాలు దెబ్బతిన్నాయి. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు కొందరు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
కాగా, జనగామకు జిల్లా అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయనే వాదన మొదటి నుంచి ఉంది. కానీ జిల్లాగా చేయడం లేదని ప్రత్యేక జనగామ జిల్లాను కోరుకుంటున్న వారు మండిపడుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల కోసం డిమాండ్లు వినిపించాయి, వినిపిస్తున్నాయి. జనగామ జిల్లా కోసం మాత్రం అన్నింటికంటే మించి ఉద్యమం జరుగుతోంది.
జనగామ జిల్లాపై ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
జనగామ జిల్లా పైన భువనగిరి ఎంపీ, జనగామ ఎమ్మెల్యే మధ్య కొద్ది రోజుల క్రితం మాటల యుద్ధం కూడా సాగింది. ఇరువురు ప్రజాప్రతినిధులు కూడా తెరాస నేతలే. జనగామ జిల్లా కోసం తాను తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని, కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నుంచి ప్రయత్నాలు లేవని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గతంలో ఆరోపించారు.
యాదాద్రిలోకి..
తెలంగాణలో ప్రస్తుతం పది జిల్లాలు ఉన్నాయి. వాటికి మరో పద్నాలుగు జిల్లాలు అదనంగా చేయనున్నారు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ చెప్పారు. కొత్త జిల్లాల లిస్టులో సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట, వరంగల్ (పాతదే) ఉన్నాయి.
కొత్త జిల్లాలపై కొత్త ట్విస్ట్: కేసీఆర్ అనుకున్నదొకటి.. చెప్పిందొకటి!
జనగామకు జిల్లా అయ్యే అర్హత ఉన్నప్పటికీ.. కొత్త జిల్లాలు సమీపంలోనే ఉండటం అతి పెద్ద మైనస్ అవుతోందనే వాదనలు ఉన్నాయి. జనగామను యాదాద్రిలో కలుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, దానికి జనగామ నియోజకవర్గ ప్రజలు అంగీకరించడం లేదు. కొత్త జిల్లా కోసం పట్టుబడుతున్నారు.
ఇప్పటికే మల్లన్న సాగర్, హామీల అమలు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయడం లేదని విపక్షాలు మండిపడుతున్నారు. మల్లన్న సాగర్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఇప్పుడు కొత్త జిల్లాల అంశం, ప్రధానంగా జనగామ కేసీఆర్కు తలనొప్పిగానే మారనుందని అంటున్నారు.