బిగ్ బజార్లో డ్రా: నోట్ల రద్దుపై కేంద్రం మరో ఊరట, స్విస్ అకౌంట్లపై మరో అడుగు
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన కేంద్రం దృష్టి సారించింది. 24వ తేదీ నుంచి బిగ్ బజార్ షాపింగ్ మాల్స్లో డెబిట్ కార్డు ద్వారా రూ.2000 వరకు డబ్బులు డ్రా చేయవచ్చు.
న్యూఢిల్లీ/హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలకు ఊరట కలిగించే మరో ప్రకటన వెలువడింది. ఈ నెల 24వ తేదీ నుంచి బిగ్ బజార్ షాపింగ్ మాల్స్లో డెబిట్ కార్డు ద్వారా రూ.2000 వరకు డబ్బులు డ్రా చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే ఈ నెల 24తో ముగియనున్న ఎయిర్ పోర్టులో ఉచిత పార్కింగ్ను ఈ నెల 28 అర్థరాత్రి వరకు పొడిగించింది. ఐఆర్టీసీలో టికెట్ల బుకింగ్ సర్వీస్ ట్యాక్స్ను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
పాత రూ.1000, రూ.500 నోట్లు చిన్న మొత్తాల పొదుపులో డిపాజిట్ చేసుకునే అవకాశం లేదని తెలిపింది. అయితే బ్యాంకు ఖాతాలేని వారు ఇతర ఖాతాదారుల లిఖితపూర్వక అనుమతితో జమ చేసే మొత్తాన్ని పది వేల నుంచి ఇరవై వేలకు ఆర్బీఐ పెంచింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయంతో బిగ్ బజార్కు మినీ ఏటీఎంల ద్వారా ఈ సహకారం అందించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 258 బిగ్ బజార్ స్టోర్లలో ఈ సదుపాయం ఉంటుంది. 115 నగరాల్లో బిగ్ బజార్ స్టోర్లు ఉన్నాయి.
కేంద్రం దిద్దుబాటు: నాకే తెలియదంటున్నారు.. : పాయింట్ లాగిన జైట్లీ
స్విస్ అకౌంట్లపై సర్జికల్ స్ట్రయిక్స్కు రంగం సిద్ధం!
నల్లధనంపై కేంద్రం పోరాటంలో మరో పెద్ద ముందడుగు పడింది. స్విట్జర్లాండ్తో సమాచార మార్పిడికి ఒప్పందం కుదిరింది. స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న భారతీయులకు సంబందించిన ఆర్థిక సమాచారం ఆటోమేటిక్గా 2019 సెప్టెంబర్ నుంచి భారత ప్రభుత్వానికి అందనుంది.
విదేశాల్లో పోగుపడుతున్న నల్లధనంపై పోరాడేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి అమలు కోసం ఉద్దేశించిన ఉమ్మడి ప్రకటనపై సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర, భారతదేశంలో స్విస్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ గిల్లీస్ రోడ్యుట్ మంగళవారం సంతకాలు చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. భారతదేశ పౌరులు 2018 నుంచి స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నిర్వహించే అకౌంట్లకు సంబంధించిన సమాచారం ఆటోమేటిక్గా బారత ప్రభుత్వానికి అందుతాయని పేర్కొంది. ఆఫ్షోర్ అకౌంట్లలో పోగుపడిన నల్లధనంతో పోరాడటానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపింది.