నోట్ల రద్దు: శనివారం వృద్ధులకే స్పెషల్, 2 రోజులు మార్పిడికి అవకాశం లేనట్లే!
రేపు అనగా, శనివారం నాడు దేశంలోని అన్ని బ్యాంకులలోను కేవలం వృద్ధులకే నగదు మార్పిడికి అవకాశం కల్పించనున్నారు.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి నేపథ్యంల ఏటీఎంలు, బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు వృద్ధుల కోసం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి. రేపు (శనివారం) నాడు అన్ని బ్యాంకులలోను నోట్ల మార్పిడిని కేవలం వృద్ధులకే కేటాయించనున్నారు.
అలా విడిపిస్తున్నారు: నల్లధనం మార్చుకునేందుకు మరో కొత్త 'ఐడియా'!
రేపు ఒక్కరోజు దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లు తమ పెద్ద నోట్లను మార్చుకునేందుకు, ఇతర లావాదేవీలను నిర్వహించుకునేలా బ్యాంకులు అవకాశం కల్పించాయి. బ్యాంకు లావాదేవీలు, నగదు మార్పిడికి కేవలం వృద్ధులను మాత్రమే అనుమతిస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఆదివారం బ్యాంకులకు సెలవు దినం కావడంతో వరుసగా రెండు రోజుల నోట్ల మార్పిడికి అవకాశం లేనట్లే.
ఓ విధంగా శనివారం అన్ని బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసారనే చెప్పవచ్చు. వృద్ధులకు మినహాయింపునిచ్చారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఛైర్మన్ రాజీవ్ రుషి వెల్లడించారు.
అయితే, మిగిలిన అన్నీ లావాదేవీలు యథావిధిగా నడుస్తాయని, రేపు బ్యాంకులు తమ పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటాయన్నారు. నగదు మార్పిడి కోసం వస్తున్నవారికి సిరా చుక్కపెట్టడం వల్ల బ్యాంకుల్లో రద్దీ దాదాపు నలభై శాతం మేర తగ్గిందన్నారు.