తెలంగాణ హోంమంత్రికి చేదు అనుభవం.. ప్రగతి భవన్ నుంచి వెనక్కి..
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ చర్యలు,లాక్ డౌన్ తదితర అంశాలపై ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం జరుగుతున్న వేళ హోంమంత్రి అక్కడికి వెళ్లారు. అయితే అనుమతి లేని కారణంగా భద్రతా సిబ్బంది ఆయన్ను లోపలికి అనుమతించలేదు. దీంతో చేసేది లేక ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే ఇదే సమావేశానికి హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే డీజీపీ మహేందర్ రెడ్డి హాజరుకావడం గమనార్హం.హోంమంత్రిని ప్రగతి భవన్లోకి అనుమతించకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే సమావేశానికి కొంతమందికే అనుమతి ఇచ్చారని.. మహమూద్ అలీ కాకతాళీయంగా ప్రగతి భవన్కు రావడంతో ఆయన్ను అనుమతించలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నట్టు సమాచారం. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లి రాష్ట్రానికి తిరిగివచ్చినవారిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో సీఎం పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశం అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటెల,అధికారులు కూడా సీఎం వెంట రాజ్భవన్కు వెళ్లారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు,తీసుకుంటున్న చర్యలపై సీఎం గవర్నర్కు వివరించినట్టు సమాచారం.