బాల్క సుమన్ పెళ్లి చేసింది డిప్యూటీ స్పీకరే .. అమ్మాయి తల్లిదండ్రులకు ఏం చెప్పాడో తెలుసా ..?
హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఎన్నికయ్యాక అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. మిగతా సభ్యుల మాదిరిగానే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రసంగించారు. పద్మారావు గౌడ్ తమతో ఉద్యమంలో కలిసి పనిచేసిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. పనిలో పనిగా తన ప్రేమ పెళ్లిని కూడా చేశారని చెప్పుకొచ్చారు.
పెళ్లి పెద్దగా పద్మారావు
బాల్కసుమన్ ఓ అమ్మాయిని ప్రేమించారు. అయితే వారిది ఇతర కులాలు వేరుకావడంతో పెళ్లికి అమ్మాయి పేరెంట్స్ వెనకడుగు వేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు పద్మారావు గౌడ్, శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు. అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఒప్పించేందుకు 3 నెలల సమయం పట్టింది. పలు విడతలుగా చర్చలు జరిపి .. ప్రేమజంటను ఒక్కటి చేశారు.
అమ్మాయి పేరెంట్స్ కు ఏ చెప్పారు
సుమన్ ప్రేవ వ్యవహారం తెలిసిన వెంటనే పెద్దగా వ్యవహరించారు పద్మారావుగౌడ్. అమ్మాయిది కూడా పద్మారావు కులం కావడం, పద్మారావు చొరవ తీసుకొని చర్చలు జరపడం అలా కలిసొచ్చింది. సుమన్ మంచి అబ్బాయి అని .. కేసీఆర్ కు అత్యంత దగ్గర అని అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పారు పద్మారావు. అయినా వారికి ఎక్కడో వెలితి ఉండటంతో భవిష్యత్ లో ఎమ్మెల్యే అవుతారని చెప్పారట. దీంతో అప్పటివరకు సుమన్ భవిష్యత్ పై ఉన్న నీలినీడలు వీడి .. తమ కూతురిని ఇచ్చేందుకు వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పద్మారావు గౌడ్ మంచి కార్మికనేతనే కాదు .. రెండు మనసులను కలిపిన మంచి మనస్సున వ్యక్తి అని అసెంబ్లీలో సుమన్ చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి.
విద్యార్థి నేత నుంచి ఎంపీ .. ఎమ్మెల్యే
పద్మారావు గౌడ్ నోటి వాక్కో .. లేదా సుమన్ అదృష్టమో తెలియదు కానీ .. అంతా ఆయన చెప్పినట్టే జరిగింది. టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడి నుంచి సుమన్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. తొలి ఎన్నికతోనే పార్లమెంట్ కు వెళ్లి .. లోక్ సభలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపు, హై కోర్టు విభజనపై తన స్వరాన్ని గట్టిగానే వినిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అందుకేనేమో .. మీ నోటి వాక్కు అని సుమన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
హైదరాబాద్ అంటే పద్మారావు .. నాయిని ...
తాము విద్యార్థి దశలో ఉండగా సభలు, సమావేశాల కోసం ఏర్పాట్లు చేయాలంటే పద్మారావు గౌడ్, నాయిని నర్సింహారెడ్డి అని గుర్తుచేశారు సుమన్. తమ వెన్నంటే ఉండి రాజకీయాల్లో ఓనమాలు నేర్చించారని .. కార్మికుల సంక్షేమం కోసం పద్మారావు గౌడ్ విశేషంగా కృషిచేశారని తెలిపారు.