ట్రిపుల్ తలాక్: ఆమెకు అదే పని అందుకే విడాకులు, న్యాయం చేయాలంటున్న బాధితురాలు
హైదరాబాద్: ట్రిపుల్ తలాక్పై నిషేధం ఉన్నా.. చిన్న చిన్న కారణాలతో తమ భార్యలకు ట్రిపుల్ తలాక్లను భర్తలు పంపుతున్నారు. తాజాగా మరో ఘటన హైద్రాబాద్లో చోటు చేసుకొంది.పెళ్ళైన రెండు మాసాలకే భర్త భార్యకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడు. తనకు న్యాయం చేయాలని భార్య పోలీసులను ఆశ్రయించింది.
పెళ్ళైన రెండు మాసాలకే భార్యకు ట్రిపుల్ తలాక్ నోటీసులు పంపిన ఘటన హైద్రాబాద్ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం నాడు చోటు చేసుకొంది. అమాన్నగర్కు చెందిన ఓ వ్యక్తి కూతురుకు యాకుత్పురా జాఫర్రోడ్డు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో గత ఏడాది డిసెంబర్ 11న వివాహం జరిగింది.
ఏ కారణం లేకుండానే భర్త గత నెల ఫిబ్రవరి 25న విడాకులు పంపగా ఈనెల7న తనకు ముట్టాయని బాధితురాలు తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ భాధితురాలు మార్చి9న షాహీన్ స్వచ్చంధ సంస్థ ప్రతినిధులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న రైన్బజార్ పోలీసులు ఆమె భర్తను సంప్రదించారు. డైవోర్స్ డిక్లరేషన్పై తన మామ, బావ మరిది సంతకాలు చేశారని బాధితురాలి భర్త చెప్పారని పోలీసులు తెలిపారు. అంతేకాదు వివాహమైనప్పటి నుండి తన భార్య చేతులు కోసుకొంటుందని, ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తోందని భర్త పోలీసులకు వివరించారు.
అయితే తన కుటుంబసభ్యులకు తనకు మాయమాటలు చెప్పి తన సంతకాలు తీసుకొన్నారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.