అదే దోపిడీ..అదే లూటీ: అకున్ సబర్వాల్ గారూ...థియేటర్లలో ధరల దోపిడీ ఆగలేదు
Recommended Video
అదే దోపిడీ... అదే లూటీ... ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ ధరకు తినుబండారాలు, కూల్ డ్రింక్స్ అమ్మకూడదన్న ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ యథావిధిగా దోచుకుంటున్నాయి పలు మల్టీప్లెక్సులు, బడా థియేటర్లు. ఆగష్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలను బేఖాతరు చేశాయి ఆయా థియేటర్ యాజమాన్యాలు. థియేటర్లలో ధరలు ఎలా అమలు చేస్తున్నారనేదానిపై పలు మీడియా ఛానెళ్లు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. అయితే పెద్ద థియేటర్లలో ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది.
థియేటర్లలో దొరికే తినుబండారాలు కానీ , పానీయాలు కానీ బయటికంటే మూడురెట్లు అధిక రేటుతో అమ్ముతున్నారు. రూ.20గా ఉన్న కూల్ డ్రింక్ను రూ.120 రూపాయలకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ మాల్స్ పీవీఆర్ , ఐనాక్స్, సినీమ్యాక్స్లలో 650 మిల్లీలీటర్లు కూల్ డ్రింక్స్ రూ.180కు అమ్ముతున్నారు. అంతేకాదు పాప్కార్న్ ప్యాకెట్ రూ. 125 విక్రయించారు. వాటర్ బాటిల్స్ రూ.80కు అమ్ముతున్నారు. కాంబోల పేరిట 300 రూపాయలు పిండి వసూలు చేస్తున్నారు. ఇక బడా థియేటర్లలో ఫుడ్ ఐటెమ్స్ ధర తగ్గిందని తెలిసి వెళుతున్న ప్రేక్షకులకు నిరాశే మిగులుతోంది.
ఇక కొన్ని థియేటర్లో ప్రేక్షకులు బయట నుంచి తెచ్చుకుంటున్న వాటర్ బాటిల్స్ కూడా లోపలికి తీసుకెళ్లేందుకు థియేటర్ యాజమాన్యాలు అనుమతించడంలేదు. బంజారా హిల్స్ లోని ఐనాక్స్ థియేటర్ లో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ అధిక రేట్లు సామాన్యుడి జేబును కొల్లగొడుతున్నాయి. ఇదిలా ఉంటే అధిక రేట్లతో తినుబండారాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు తెలిపారు.అధిక ధరలపై ఫిర్యాదు చేయాలంటే టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్స్ యాప్ నంబరు 7330774444ను సంప్రదించాలని తూనికలు, కొలతల శాఖ ప్రకటించింది.