హైదరాబాద్కు దేవెగౌడ: కేసీఆర్తో భేటీ, తాజా పరిస్థితిపై చర్చ
హైదరాబాద్: మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ శనివారం సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు.ప్రత్యేక విమానంలో భాగ్యనగరానికి చేరుకోనున్న ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు స్వాగతం పలకనున్నారు.
అక్కడి నుంచి నేరుగా ప్రగతి భనవ్కు వెళ్లనున్న దేవెగౌడ.. ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం అవుతారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాఖ్య కూటమి ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై వారిద్దరూ కీలకంగా చర్చించనున్నారు.
దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో సమాఖ్య కూటమి ఏర్పాటే ప్రధాన ఎజెండాగా ఇటీవల సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లి దేవెగౌడతో సమావేశమై చర్చించారు. అంతకుముందు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ ఆయన భేటీ అయి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లేందుకే మొగ్గుచూపుతుండటం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కలిసి కర్ణాటకలో జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది.