చంద్రబాబుకు పెద్ద షాక్: రేవంత్ రెడ్డి బాటలో దేవేందర్ గౌడ్?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణలో మరో షాక్ తగలబోతోంది. టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ పార్టీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. ఆయన రేవంత్ రెడ్డి బాటలో నడుస్తారని అంటున్నారు.
టిడిపికి రాజీనామా చేసి, త్వరలో కాంగ్రెసులో చేరాలని దేవేందర్ గౌడ్ కాంగ్రెసులో చేరాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. టిడిపిలో ఉంటే భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే ఆయన ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కుమారుడి కోసమే దేవేందర్ గౌడ్
దేవేందర్ గౌడ్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కారణం ఏమిటనేది తెలియదు. అయితే, ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు సమాచారం. దాంతో కుమారుడి కోసం కాంగ్రెసు పార్టీలో చేరాలనే ఉద్దేశంతో దేవేందర్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తోంది.
కెసిఆర్తో ఎలాగూ పొసగదు...
తెలంగాణ ఉద్యమ కాలంలో దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆయన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చివరకు సొంతగూటికి చేరుకున్నారు. అయితే టిడిపిలో భవిష్యత్తు లేకపోవడంతో పార్టీ మారాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో పొసగదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరే అవకాశం లేదన అంటున్నారు.
నాగం జనార్దన్ రెడ్డిని చూసిన తర్వాత..
నాగం జనార్దన్ రెడ్డిని చూసిన తర్వాత బిజెపిలో చేరడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని దేవేందర్ గౌడ్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇతర పార్టీల్లోంచి వచ్చిన వారికి బిజెపిలో పెద్దగా గుర్తింపు ఉండదు. నాగం జనార్దన్ రెడ్డిని ఇప్పుడు బిజెపి నాయకత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు. అందువల్ల కాంగ్రెసులో చేరడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వారే మిగులుతారా....
తెలుగుదేశం పార్టీలో చివరకు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, ఇంకా ఇద్దరో ముగ్గురో మాత్రమే మిగులుతారా అనే సందేహం కలుగుతోంది. దేవేందర్ గౌడ్ చేరితే కాంగ్రెసు బలపడడం మాత్రం ఖాయం. రంగారెడ్డి జిల్లాలనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు పలుకుబడి ఉంది. పైగా బీసి నేత కావడంతో కాంగ్రెసుకు కలిసి వచ్చే అవకాశం ఉంది.