26వేల మంది పోలీసులతో భద్రత: గణేశ్ నిమజ్జనంపై ఖాకీ నిఘా, ఏరియల్ సర్వే!
హైదరాబాద్లో నిమజ్జనానికి భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించినట్లు తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్లో గణేష్ నిమజ్జనమంటే వాహనాదారులకు చుక్కలే. ఓ పక్క నిమజ్జనంలో పాల్గొనేవాళ్లు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటే.. వాహనదారులు మాత్రం రోడ్డుపై ఇంచు కూడా కదల్లేక ఇబ్బందులు పడుతుంటారు. ప్రతీ సంవత్సరం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ బాధలు తప్పడం లేదు.
తాజాగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై డీజీపీ అనురాగ్శర్మ వివరాలు వెల్లడించారు. గతేడాది లాగే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ముందుగా నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. దీనికి గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఒప్పుంకుందని,శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు కలగకుండడా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
హైదరాబాద్లో నిమజ్జనానికి భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించినట్లు తెలిపారు. 11 మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, 10 మంది ఎస్పీలు, ఏడుగురు ఏఎస్పీలు, 122 మంది డీఎస్పీలు, 333 మంది సీఐలు, వెయ్యి మందికి పైగా ఎస్ఐలు, 80 ప్లాటూన్ల పారా మిలటరీ బలగాలు.. మొత్తంగా 26వేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
భద్రతా విధుల కోసం ఏపీ నుంచి కూడా 1000మంది పోలీసులు రప్పిస్తున్నట్లు వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారా గణపతి శోభాయాత్ర మార్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. అలాగే ఏరియల్ సర్వే ద్వారా బందోబస్తును పరిశీలిస్తామని డీజీపీ తెలియజేశారు.
కాగా, గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 5న ప్రభుత్వం సెలవు దినం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఇది వర్తిస్తుంది. దీనికి బదులు వచ్చే రెండో శనివారాన్ని ప్రభుత్వం పని దినంగా ప్రకటించింది.