మా వద్ద మావోలు లేరు: డిజిపి స్పష్టీకరణ, ప్రభుత్వంపై వివి ఫైర్
హైదరాబాద్/ వరంగల్: పోలీసుల అధుపులో మావోయిస్టులు ఎవరూ లేరని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా నక్సల్స్ రిక్రూట్మెంట్ జరగలేదని ఆయన చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణిచారని ఆయన చెప్పారు.
వరంగల్ జిల్లా మేడారం అడవుల్లో నక్సల్స్ సమావేశం జరుగుతుందన్న సమాచారంతోనే పోలీసులు కూంబింగ్ నిర్వహించారని, ఈ క్రమంలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం లేకుండా తమ పోలీస్ వ్యవస్థ సమర్ధంగా పనిచేస్తోందన్నారు.
గణేష్ ఉత్సవాలకు భారీగా బందోబస్తును కల్పిస్తున్నామని, బందోబస్తుకు రాష్ట్ర బలగాలతో పాటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి అదనపు బలగాలను రప్పిస్తున్నామని ఇయన తెలిపారు.
కాగా, ఎన్కౌంటర్లో మృతి చెందిన నక్సలైట్లు విద్యాసాగర్ రెడ్డి, శ్రుతి మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహిస్తున్న వరంగల్లోని ఎంజిఎం ఆస్పత్రి వద్ద విప్లవ సానుభూతిపరులు, విప్లవ రచయితల సంఘం (విరసం) నేతలు ధర్నా చేశారు. తెలంగాణ ప్రభుత్వం విరసం నేత వరవరరావు తీవ్రంగా మండిపడ్డారు.
నక్సలైట్ల ఎజెండానే తన ఎజెండా అని ప్రకటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కనీసం రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.