మళ్లీ శ్రీనివాస్ హత్య కేసు దర్యాప్తు: పరారీలో అనుమానితులు?
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును తిరిగి ప్రారంభం నుంచి దర్యాప్తు చేయాలని పోలీసుశాఖ నిర్ణయానికి వచ్చింది. ఈ విషయమై సోమవారం సమీక్షించిన డీజీపీ మహేందర్రెడ్డి.. వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ద్వాకా ఈ కేసు పూర్తి వివరాలపై ఆరా తీశారు.
Recommended Video
గత నెల 24వ తేదీన శ్రీనివాస్ హత్య జరిగినప్పటి నుంచి నిందితుల అరెస్టు వరకు జరిగిన పరిణామాలన్నింటినీ స్టీఫెన్ రవీంద్ర ఓ నివేదిక రూపంలో డీజీపీకి అందచేశారు. దీంతో ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఏయే అంశాల్లో నిర్లక్ష్యం వహించారు, నిందితుల కాల్డేటాలో ఉన్న నంబర్లు ఎవరివి, వారికి నిందితులకు ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాలపై పూర్తిగా ద్రుష్టి సారించాలని ఐజీ స్టీఫెన్ రవీంద్రను ఆదేశించారు.
నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తునకు ఐజీకి ఇలా ఆదేశాలు
హత్య జరిగిన రోజు, తర్వాతి రోజు పదే పదే వెళ్లిన ఫోన్కాల్స్ వివరాలేమిటన్న అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఐజీ స్టీఫెన్ రవీంద్రను డీజీపీని ఆదేశించినట్టు తెలిసింది. నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు జరపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నల్లగొండ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లతో ఐజీ స్టీఫెన్ రవీంద్ర సమావేశమై కేసు పూర్వాపరాలు, రాజకీయ ఒత్తిళ్లపై ఆరా తీశారని తెలిసింది. పోలీసుశాఖ కేసును తిరిగి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం అందడంతో కాల్ డేటాలోని అనుమానితులంతా పరారీలో ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది.
డీఎస్పీ, ఇన్స్పెక్టర్లతో ఐజీ స్టీఫెన్ రవీంద్ర భేటీ
శ్రీనివాస్ హత్య జరిగిన జనవరి 24 నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటిపైనా డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్షించడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లయింది. ఇప్పటివరకు జరిగిన విచారణ అంతా గందరగోళంగా ఉండటం, దర్యాప్తు అధికారులు అనుమానితుల కాల్డేటాను గాలికి వదిలేయడం, నిందితులను కస్టడీలోకి తీసుకోకపోవడం, కాంగ్రెస్ ఆరోపిస్తున్న అంశాలు తేలనున్నాయి. ఇన్స్పెక్టర్ అదృశ్యం వెనక ఉన్న కారణాలు, ఒత్తిళ్లు వచ్చి ఉంటే అలా ఒత్తిడి చేసిందెవరన్న దానిపై నివేదిక ఇవ్వాలని కూడా డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ స్టీఫెన్ రవీంద్రను ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కేసులో సంబంధం ఉన్నవారందరినీ విచారించాల్సిందే
కేసుకు సంబంధం ఉన్న వారెవ్వరినీ వదిలిపెట్టవద్దని, ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం సన్నగిల్లకుండా విచారణ జరగాలని ఆదేశించినట్టు సమాచారం. శ్రీనివాస్ హత్య కేసులో ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన నారాయణ్పేట్ డీఎస్పీ శ్రీధర్తో పాటు నల్లగొండ టూటౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం ఐజీ స్టీఫెన్ రవీంద్రను కలిశారు. కేసు దర్యాప్తు వివరాలను తెలిపారు. కాల్డేటాను విశ్లేషించడంలో నిర్లక్ష్యం, ఆ కాల్డేటాలోని గుర్తించి విచారించకపోవడంపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆరా తీసినట్టు తెలిసింది.
అన్ని అంశాలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపాలని ఆదేశాలు
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో కాల్డేటాతో పేర్లు బయటికి వచ్చిన వారంతా పరారీలో ఉన్నట్టు నల్లగొండ పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు వెల్లడించారు. ఒకవేళ వారికి హత్యతో సంబంధం లేకుంటే ఎందుకు పరారయ్యారు, కారణాలేమిటన్న దానిపై దర్యాప్తు జరపాలని ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లును ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించినట్లు సమాచారం. రాంబాబు, మల్లేశ్ కాల్డేటాలోని మిగతా అనుమానాస్పద నంబర్ల విషయం తేల్చాలని ఇన్స్పెక్టర్, డీఎస్పీలను ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు యదేచ్ఛగా తిరిగిన అనుమానితులు.. కేసు పున: దర్యాప్తు చేయనున్నారన్న సమాచారం అందగానే ఎందుకు పరారయ్యారన్నదీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వీరిలో కొందరికీ బెయిల్ కూడా మంజూరైంది. ఆదివారం నల్లగొండలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించడం.. మరోవైపు బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ దరిమిలా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రాజకీయ విమర్శల మాటెలా ఉన్నా.. ఒకింత కొంత మేరకైనా నిజానిజాలు వెలుగు చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.