మహేష్ కత్తి ఖేల్ ఖతమ్! హైదరాబాద్ వచ్చినా, పోస్ట్ పెట్టినా జైలుకే, టీవీ ఛానల్కు డీజీపీ షాక్
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం తెలిపారు. కానీ కత్తి మహేష్ వంటి వారు సమాజంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు ఏమాత్రం సరికాదన్నారు.
పరిపూర్ణానంద ఆగ్రహం: మహేష్ కత్తికి పోలీసుల షాక్,నగర బహిష్కరణ
ఆరు నెలల పాటు మహేష్ కత్తిని నగరం నుంచి బహిష్కరించామని చెప్పారు. ఓ టీవీ ఛానల్ పదేపదే ఇందుకు సంబంధించిన చర్చలు పెట్టడం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. టీవీ ఛానల్ను వేదికగా చేసుకొని మహేష్ కత్తి మళ్లీ మళ్లీ భావవ్యక్తీకరణ పేరుతో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయన తన వ్యాఖ్యలతో మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు.
మహేష్ కత్తి ఉన్మాదపు భావజాలం, అంబేడ్కర్ రాముడ్ని కీర్తించారు: పరిపూర్ణానంద
మళ్లీ హైదరాబాద్ వస్తే జైలు శిక్ష
ఈ కారణంగా సమాజంలో శాంతిభద్రత భంగానికి దారి తీస్తున్నాయని డీజీపీ చెప్పారు. ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా అభిప్రాయాలు వ్యక్తీకరించాలన్నారు. మహేష్ కత్తి అనుమతి లేకుండా నగరంలోకి వస్తే అరెస్టు చేసి, క్రిమినల్ కేసు పెట్టి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. అతనిని చిత్తూరు జిల్లాలోని స్వస్థలం తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
భావవ్యక్తీకరణ పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు సరికాదు
తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు వ్యవస్థ కట్టుబడి ఉందని డీజీపీ చెప్పారు. నగరంలో ఎవరైనా ఉండవచ్చు కానీ శాంతిభద్రతలు రెచ్చగొట్టవద్దన్నారు. భావవ్యక్తీకరణ పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మహేష్ కత్తిపై ప్రస్తుతానికి నగర బహిష్కరణ ఉందని, అవసరమైతే తెలంగాణలోని జిల్లాల బహిష్కరణ కూడా చేస్తామన్నారు. రాష్ట్ర బహిష్కరణతో పాటు సోషల్ మీడియాలో మళ్లీ పోస్టులు పెట్టినా శిక్షార్హులే అన్నారు.
మహేష్ కత్తి మళ్లీ ఇలా ఎక్కడి నుంచి చేసినా చర్యలు
మహేష్ కత్తి మళ్లీ సోషల్ మీడియాలో లేదా ఇతర ఛానల్స్ ద్వారా ఇలాంటివి చేస్తే నేరం అవుతుందని, ఎక్కడి నుంచి మళ్ళీ ఇలాంటివి చేసినా ఆయనపై చర్యలు తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు. తన అభిప్రాయాలు అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, ఆ అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రక్రియలో సహకరిస్తే వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఆయన వ్యాఖ్యలు సమాజంలో భద్రతల భంగానికి దారి తీస్తున్నాయన్నారు.
ఆ టీవీ ఛానళ్లకు నోటీసులు ఇచ్చాం
వ్యక్తులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు వారికి సహకరించే వారి పైన కూడా చర్యలు తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు. ప్రోగ్రాం కోడ్ను అతిక్రమించిన టీవీ ఛానళ్లకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఓ టీవీ ఛానల్ అతని వ్యాఖ్యలను చర్చకు పెట్టడం, తద్వారా మనోభావాలను దెబ్బతీసేలా ప్రసారాలను జరపడం సమాజానికి మంచిది కాదన్నారు. కేబుల్ టీవీ చట్టాలను ఉల్లంఘించే యాజమాన్యాలకు రెండేళ్ల వరకు జైలు శిక్ష అన్నారు.
ధార్మిక సంస్థలు సంయమనం పాటించాలి
తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని డీజీపీ తెలిపారు. ధార్మిక సంస్థలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయని అందుకే రాష్ట్రానికి అనేక సంస్థలు వస్తున్నాయని చెప్పారు. యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. నాలుగేళ్లలో ఒక్క చిన్న సంఘటన జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మంచి ప్రమాణాలు గల నగరంగా హైదరాబాదుకు మూడేళ్లుగా పలు అవార్డులు వచ్చాయన్నారు.