ఉప సర్పంచ్ హత్య: ప్రియుడి మోజులో చిన్న భార్యనే, ఇలా ప్లాన్ వేసి చంపేసింది
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని ఉప సర్పంచ్ ధర్మానాయక్ హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడి మోజులో చిన్న భార్యనే అతన్ని హత్య చేసినట్లు తేలింది. కాంగ్రెసు నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య నేపథ్యంలో ధర్మానాయక్ను కూడా రాజకీయ ప్రత్యర్థులు చంపి ఉంటారనే ఊహాగానాలు చెలరేగాయి.
నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని కృష్ణపట్టి ప్రాంతానికి చెందిన నాగార్జున పేట తండాల్లో ఈ నెల 13వ తేదీన కాంగ్రెసు నేత, ఉప సర్పంచ్ హత్య జరిగిన విషయం తెలిసిందే. మిర్యాలగుడా సిఐ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
చిన్న భార్యను అదుపులోకి తీసుకుని...
ధర్మా నాయక్ హత్య కేసులో ఆయన చిన్న భార్య శిరీషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది. తన ప్రియుడి సహకారంతో ఆమె తన భర్తను హత్య చేసినట్లు తేలింది.
అతనితో వివాహేతర సంబంధం
శిరీషకు అదే తండాకు చెందిన అంగోతు రవి (19)తో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరు కలిసి నిరుడు పారిపోయారు కూడా. అయితే, గ్రామ పెద్దల పంచాయతీ మేరకు ఆమె కొంత కాలంగా భర్తతో కలిసి ఉంటోంది. అయితే, మళ్లీ రవితో చనువుగా ఉంటున్నట్లు గమనించి ధర్మా నాయక్ శిరీషను హెచ్చరించాడు.
ప్లాన్ వేసి ఇలా చేసింది.
దాంతో రవిని కలిసిన శిరీష తన భర్తను ఎలాగైనా చంపాలని చెప్పింది. రవి ఈ నెల 9వ తేదీన గ్రామ సమీపంలోని నాయకుని తండాలో చేపల వేటకు బాంబులు అమ్మే మెగావత్ హతీరాం నుంచి బాంబును కొని తన చిన్నమ్మ ద్వారా ప్రేయసి శిరీషకు పంపించాడు.
నిద్రిస్తుండగా ఇలా చేసింది..
ధర్మా నాయక్ నిద్రిస్తున్న సమయంలో ఈ నెల 13వ తేదీ న భర్త ధర్మా నాయక్ మంచంపై బాంబును పెట్టి పేల్చింది. దీంో అతను మరణించాడు. ఈ కేసులో శిరీషను, రవిని, వారికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.