పరిపూర్ణానందకు నోటీసులు: 'బాధితుల్నే అడ్డుకుంటారా, మహేష్ కత్తికి పెద్ద శిక్ష వేయాలి'
హైదరాబాద్: శ్రీరాముడిపై దారుణ అవమానకర వ్యాఖ్యలు చేసిన వివాస్పద మహేష్ కత్తిపై చర్యలు తీసుకోవాలంటూ శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పాదయాత్ర చేయాలని భావించిన శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి గృహ నిర్బంధం కొనసాగుతోంది.
Recommended Video
మహేష్ కత్తి ఖేల్ ఖతమ్! హైదరాబాద్ వచ్చినా, పోస్ట్ పెట్టినా జైలుకే, టీవీ ఛానల్కు డీజీపీ షాక్
జూబ్లిహిల్స్లోని నివాసంలో (ఆ ఇల్లు పరిపూర్ణానంద స్నేహితుడిదిగా తెలుస్తోంది) సోమవారం ఉదయం నుంచి గృహ నిర్బంధంలో పరిపూర్ణానంద స్వామి సాయంత్రం బయటకు వచ్చి తాను తన ధర్మాగ్రహ యాత్రకు అనుమతి ఇవ్వాలని మరోసారి పోలీసులను కోరారు. ఆ తర్వాత పూజల కోసం ఆయన నేరుగా మింట్కాంపౌండ్ హనుమాన్ ఆలయానికి వెళ్లారు. ఏకాదశి సందర్భంగా పూజలు చేయాలని పరిపూర్ణానంద చెప్పడంతో పోలీసులు ఆయనకు అనుమతినిచ్చారు.
పరిపూర్ణానంద స్వామికి నోటీసులు
మింట్ కాంపౌండులో ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం పరిపూర్ణానంద స్వామి తిరిగి ఇంటికి వచ్చారు. సోమవారం నాటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు పెంచారు. పరిపూర్ణానంద స్వామికి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ధర్మాగ్రహ యాత్ర చేపడతానని చెప్పడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నోటీసులు జారీ చేశారు.
ధర్మాగ్రహ యాత్రకు బయలుదేరితే అరెస్ట్ అవకాశం
పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ యాత్రకు బయలుదేరితో అరెస్టు చేసే అవకాశముంది. ప్రస్తుతం ఆయన ఇంటి వద్దే దీక్ష చేస్తున్నారు. పరిపూర్ణానందకు 151 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. ఆయనతో 25 మందిపై సెక్షన్ 151 కింద కేసు నమోదు చేశారు. పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించిన రాహుల్ పాండేపై ఐపీసీ 309 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
బాధితులను అడ్డుకోవడమా?
పరిపూర్ణానంద గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ సోమవారం బజరంగ్ దళ్ నేత భగవంతరావు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు కర్నె శ్రీశైలం, వీహెచ్పీ నాయకులు వచ్చి ప్రభుత్వ, పోలీసుల వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. బాధితులు ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుతామంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అర్చక బ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షులు రాహుల్ దేశ్పాండే పెట్రోల్ మీద పోసుకుంటూ జై శ్రీరాం అని నినదిస్తూ దూసుకురాగా, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
కత్తి మహేష్కు అంతకంటే పెద్ద శిక్ష వేయాలి
ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రా రెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పరిపూర్ణానంద స్వామితోతో మాట్లాడేందుకు వచ్చారు. తొలుత వచ్చిన చింతలను మాత్రమే అనుమతించారు. పరిపూర్ణానందను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని ఈ సందర్భంగా రాజాసింగ్, ప్రభాకర్ ప్రశ్నించారు. కత్తి మహేష్కు నగర బహిష్కరణ చాలా తక్కువ అని, అంత కంటే కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.