భార్య, పిల్లలున్నారు, ఎవరితోనూ సహజీవనం చేయడం లేదు: లైంగిక వేధింపులపై సంజయ్
Recommended Video
నిజామాబాద్: తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్ అన్నారు. డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఎవరితోనూ సహజీవనం చేయడం లేదు
ఈ నేపథ్యంలో సంజయ్ స్పందిస్తూ.. ‘నాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవు. శాంకరి నర్సింగ్ కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాము. అక్కడికి నేను వెళ్ళలేదు. అడ్మిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కాలేజీలో ఎవరు చదువుతున్నారో కూడా తెలియదు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరితో సహజీవనం చేయడం లేదు. ఎవరో విద్యార్థినులతో అలా చెప్పించారు' అని అన్నారు.
రాజకీయంగా దెబ్బతీసేందుకే..
అంతేగాక, ‘రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇవన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఎవరో తెలియదు కానీ, మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఇలాంటివి జరుగుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు' అని ధర్మపురి సంజయ్ ఆరోపించారు.
ఎంపీ డీఎస్ కొడుకు సంజయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, 11 మంది అమ్మాయిలు ఫిర్యాదు
ఆరు నెలలుగా వేధింపులు
కాగా, ఆరు నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని హోంమంత్రి నాయినికి ఇచ్చిన ఫిర్యాదులో 11 మంది విద్యార్థినులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు.
సంజయ్ను అరెస్ట్ చేయాలి
తనకు చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.