నిన్న పాలమూరు... నేడు నల్గొండ జిల్లాలో వజ్రాల గనులు, ఏడుచోట్ల..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా భూగర్భంలో బంగారు, వజ్రాల గనులున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కొద్ది రోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లాలో వజ్రాల గనులున్నట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం భూభౌతిక విభాగం శాస్త్రవేత్తలు ప్రకటించారు.
తాజాగా నల్గొండ జిల్లాలోని ఏడు ప్రదేశాల్లో వజ్రాలు, బంగారం గనులున్నట్టు వారు గుర్తించారని చెబుతున్నారు. ఈ పరిశోధన పత్రం అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన పెలాజియా జర్నల్లో సోమవారం వచ్చింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన జియోఫిజిక్స్, జియాలజీ, జాగ్రఫీ, జియోకెమిస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో మూడేళ్లుగా జిల్లాలోని గనులపై విస్తృతంగా శోధించి ఈ పత్రాన్ని సమర్పించారు. కృష్ణా, హాలియా, మూసీ, కనగల్ నదీ పరివాహక ప్రాంతాల్లో వజ్రాల గనుల ఆనవాళ్లు లభ్యమయ్యాయని ఆ పత్రంలో వివరించారని తెలుస్తోంది. ఏడు చోట్ల గనుల ఆనవాళ్లు లభ్యమయ్యాయని తెలుస్తోంది.
రామడుగు ప్రాంతంలోని వజ్రాల గనులకు వెస్ట్రర్స్ ఆస్ట్రేలియాలోని గనులతో పోలికలున్నట్టు గుర్తించారు. పెదవూర మండలంలో బంగారు గనులకు అవకాశముందని గుర్తించారు.
కృష్ణా నది, హాలియా మొదలు కొని మూసీ పరివాహక ప్రాంతం వరకు ఈ గనులు విస్తరించి ఉన్నట్టు ఉపగ్రహ సహాయంతో తీసిన రిమోట్ సెన్సింగ్ చిత్రాల ఆధారంగా జరిపిన విశ్లేషణ, నమూనాల పరీక్షలను బట్టి శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. గతంలో జీఎస్ఐ, ఏరో మాగ్నటిక్ డేటా సర్వేలు గనులను నిర్ధారించాయి.