డిక్టేటర్ మినిస్టర్ ఎర్రబెల్లి .. ప్రజలకు, ప్రతిపక్షాలకు వార్నింగ్ లు ఇస్తూ హల్ చల్
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మంత్రిగా అవకాశం వస్తే తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హల్ చల్ చేస్తున్నారు. మంత్రిగా తన దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి పట్టుమని రెండు నెలలైనా గడవకముందే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆమధ్య సర్పంచ్ లకు వార్నింగ్ ఇచ్చిన ఎర్రబెల్లి ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించి ఖమ్మం జిల్లా ప్రజలు తప్పు చేశారని ప్రజా నిర్ణయాన్ని తప్పు పట్టిన ఎర్రబెల్లి ప్రజలు ఎవరిని గెలిపించినా అందరూ చేరేది టీఆర్ఎస్ లోనే అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశారు...ఈ ఎన్నికల్లో తప్పు దిద్దుకోండి అంటున్న మంత్రి ఎర్రబెల్లి
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళలోనే సర్పంచ్ లకు వార్నింగ్
మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు తన మార్క్ పాలన చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే గ్రామ గ్రామాన, ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మాణం విషయంలో సర్పంచ్ లదే బాధ్యతని ఇంటింటికీ మరుగుదొడ్డి లేకుంటే ఆ గ్రామ సర్పంచ్ను బాధ్యుడిని చేసి.. సస్పెండ్ చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. దీంతో అవాక్కవడం సర్పంచ్ ల వంతయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును తప్పు పట్టిన ఎర్రబెల్లి... తప్పు దిద్దుకోవాలన్న మంత్రి
ఇక నాటి నుండి నేటి వరకు ఎర్రబెల్లి ఎక్కడ ఏది మాట్లాడినా సంచలనంగానే మారింది.తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలు ఎవరికి ఓటు వేసినా , ఎవరిని గెలిపించినా వారంతా టిఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందే అన్నట్లుగా మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీని తప్ప వేరే పార్టీని గెలిపించడం ప్రజలు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయం గా మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజలను షాక్ కు గురి చేస్తుంది. ఓటర్లుగా తమకు నచ్చిన నాయకుణ్ణి ఎన్నుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ఓటు హక్కు వినియోగం పైన ఎర్రబెల్లి చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి.
మీరు గెలిపించిన వాళ్ళు టీఆర్ఎస్ లో .. మీకు ఏమి కావాలన్నా మంత్రిగా నేనే చెయ్యాలి.. గుర్తుంచుకోండన్న ఎర్రబెల్లి
అంతేకాదు భద్రాచలం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీరును తప్పు పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు తప్పు చేశారు తప్పు దిద్దుకోండి అంటూ హుకుం జారీ చేశారు. మీరు గెలిపించిన వాళ్లంతా టీఆర్ఎస్ లో చేరారని, మీకేం లాభం వచ్చింది అంటూ ప్రశ్నించారు.
అంతేకాదు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తానే మంత్రి ని అని చెప్పుకున్న ఎర్రబెల్లి పింఛన్లు కావాలన్నా, రుణాలు ఇవ్వాలని అది తనతోనే సాధ్యమవుతుందని ప్రజలతో చెప్పడం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే ఇవన్నీ ఇవ్వమని ఒకరకంగా బెదిరింపులకు పాల్పడడమే అని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.
డిక్టేటర్ మంత్రిపై పార్టీ లో చర్చ .. కేసీఆర్ ముందు కుప్పిగంతులు వేస్తే కష్టమే
అంతేకాకుండా ఓటర్లను ప్రలోభపెట్టడం కూడా చేస్తున్న మంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీకి 70 శాతం ఓట్లు వేసిన మండలాలను, 80 శాతం ఓట్లు వేసిన గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారింది. తన మార్కు పాలన చూపించాలని తహతహలాడుతున్న ఎర్రబెల్లి, డిక్టేటర్ మంత్రిగా మారుతున్న వైనం పార్టీ శ్రేణుల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. మంత్రిగా అవకాశం ఇచ్చిన కెసిఆర్ పై విధేయత చూపించడం కోసం నానా పాట్లు పడుతున్న ఎర్రబెల్లి, మంత్రిని అయ్యానన్న సంతోషంలో హల్ చల్ చేస్తున్నారు. ఎర్రబెల్లి తీరును చూసిన కొందరు పార్టీ నాయకులు కెసిఆర్ ముందే కుప్పిగంతులా... కట్ చేస్తారు అంటూ గుసగుసలాడుకుంటున్నారట.