జానా కోవర్టు అంటూ పాల్వాయి: కాంగ్రెసులో ముదిరిన విభేదాలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు పార్టీలో విభేదాలు ముదిరాయి. నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరుతారనే నేపథ్యంలో ఈ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత జానా రెడ్డి కోవర్టు అంటూ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.
పాల్వాయి గోవర్ధన్ రెడ్డిపై షబ్బీర్ అలీ వంటి నాయకులు విరుచుకుపడ్డారు. క్రమశిక్షణ లేని వాళ్లు ఎంతమంది పార్టీ వీడినా నష్టం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్రెడ్డి బుధవారం పార్టీ నేతలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ పాల్వాయి లాంటి వాళ్ల వల్ల అధికారంలోకి రాలేకపోయామన్నారు. పెద్దవాళ్లని మర్యాద ఇస్తుంటే తలకు మించి మాట్లాడుతున్నారని అన్నారు. పాల్వాయికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరతానని చెప్పారు.
షబ్బీర్ అలీ వ్యాఖ్యలకు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ధీటుగా స్పందించారు. తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వబోరని ఆయన అన్నారు. కోవర్టులు పార్టీని వీడాలని ఆయన గురువారంనాడు అన్నారు. తానే పెద్ద ప్రతిపక్ష నేతనని, తనకన్నా ప్రతిపక్ష నేత ఎవరూ లేరని ఆయన చెప్పుకున్నారు.
తాను ముక్కుసూటిగా ఉంటాని చెప్పారు. జానారెడ్డి ఆరోపణలకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ వివరణ కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హిట్లర్ను తలపిస్తున్నారని, నియంత పాలనలో ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు.
సిఎల్పీ నేత కె జానారెడ్డిని కోవర్టుగా నిందిస్తూ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెసులో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. గోవర్ధన్ రెడ్డిపై షబ్బీర్ అలీ తీవ్రంగా మండిపడ్డారు. అదే స్థాయిలో గోవర్దన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.