చిరంజీవి పై పరోక్షంగా పెదరాయుడి వ్యాఖ్యలు- రెచ్చగొట్టవద్దు : మోహన్ బాబుకు ఆవేశం ఎక్కువ: తలసాని..!!
"మా" ఎన్నికల్లో గెలుపొందిన విష్ణుతో పాటుగా ఆయన ప్యానల్ నుంచి ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసారు. ఇప్పటికే "మా" అధ్యక్షుడిగా విష్ణు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిధిగా హాజరైన విష్ణును అభినందించారు. ఇదే సమయంలో మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేసారు. "మా" ఎన్నికలు అసెంబ్లీ-పార్లమెంట్ ఎన్నికలను తలిపించే తరహాలో జరిగాయని మంత్రి వ్యాఖ్యానించారు. "మా" చిన్నది కాదని..912 మంది సభ్యులు ఉన్న సంస్థగా పేర్కొన్నారు. చివర్లో మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు.
మోహన్ బాబు పై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
ఇక యువకుడు భుజస్కందాల మీద "మా" నిలబడిందని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు తన కుమారుడు విష్ణుకు క్రమశిక్షణ ఇచ్చారని..అదే ఇప్పుడు విష్ణను నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. తిరుపతిలో విద్యా సంస్థలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ఇక, ఇదే సమయంలో మంత్రి తలసాని తనకు మోహన్ బాబుకు చాలా కాలంగా పరిచయం ఉందని చెప్పుకొచ్చారు. మోహన్ బాబుకు కోపం - ఆవేశం ఎక్కవని చెప్పారు. వాటి కారణంగా మోహన్ బాబు నష్టపోయారు కానీ, ఇతరులకు నష్టం జరగలేదని వివరించారు
ఆన్ లైన్ టిక్కెట్ల విధానం తీసుకొచ్చాం
తప్పును ధైర్యంగా చెప్పే వ్యక్తి మోహన్ బాబు అని వ్యాఖ్యానించారు. మంచి టీంను సభ్యులు ఎన్నుకున్నారంటూ మంత్రి ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి "మా" కు మంచు విష్ణుకు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో ద్వారా పూర్తిగా సహకరిస్తోందని వివరించారు. ఆన్ లైన్ టిక్కెట్ల విధానం తొలుత తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వమే అంటూ మంత్రి తలసాని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాణ స్వీకారంలో పూర్తిగా విష్ణు మద్దతు దారులు..ఆయన ప్యానల్ సభ్యులే ఎక్కువగా కనిపించారు.
చిరంజీవిపైన మోహన్ బాబు పరోక్ష వ్యాఖ్యలు
నాకు పగ..ద్వేషాలు లేవు. నా కోసం నాకే నష్టం చేసింది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే తప్పు బడతారు. నువ్వు గొప్పా..నేను గొప్పా అనేది ముఖ్యం కాదు. నా బిడ్డను మీ చేతుల్లో పెట్టాను. ఓట్లు వేయని వారి మీద పగ వద్దు. కలిసి-మెలిసి ఉందాం. బెదిరింపులకు కళా కారులు ఎవరూ భయపడరు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు. కేసీఆర్ ను కలుస్తామని చెప్పారు. ఇళ్ల కోసం తాను వెళ్లి కేసీఆర్ ను అడుగుతానని చెప్పారు. ఆత్మీయుల్లారా..ఈ అసోషియేషన్ కు మీకు సంబంధం లేదని అనుకోవద్దు. రాకపోయినా మీ అందరి అశీస్సులు కావాలని చెప్పారు. కలిసి-మెలిసి పని చేసుకుందామని పిలుపునిచ్చారు. రెండు సంవత్సరాలైనా .. చిన్న ఉద్యోగమైనా..కొంత మంది అంటుంటారు అంటూ పరోక్షంగా చిరంజీవి కి సమాధానం చెప్పారు. ఆ కుర్చీ లో కూర్చున్న వ్యక్తిని గౌరవించమని కోరారు. రాజకీయాల కంటే టాలీవుడ్ లో పాలిటిక్స్ ఎక్కువ అయ్యాయి. ఇక టీవీల ముందుకు రావద్దు. రెచ్చగొట్టవద్దని సూచించారు. ఐ లవ్ యూ ఆల్ అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం ను కలుస్తామని చెప్పారు.
చిరంజీవిని ఆహ్వానించ లేదా..ఆయన రాలేదా
నిర్మాతల సంఘం నేతలు హాజరయ్యారు. విష్ణు ప్రమాణ స్వీకారానికి తండ్రి మోహన్ బాబుతో కలిసి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. నందమూరి బాలక్రిష్ణతో పాటుగా కోట శ్రీనివాసరావు, పరుచూరి బ్రదర్స్, సత్యానారాయణ వంటి వారి నివాసాలకు వెళ్లి వారి సహకారానికి ధన్యవాదాలు చెప్పారు. కొంత మంది సినీ ప్రముఖులకు మోహన్ బాబు - విష్ణు ఫోన్ చేసి ప్రమాణ స్వీకరణకు రావాలని ఆహ్వానించారు. అయితే, మెగా క్యాంపు నుంచి మాత్రం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎవరూ కనిపించ లేదు. చిరంజీవిని ఆహ్వానించలేదనే ప్రచారం సాగుతోంది. ఏపీ మంత్రి పేర్ని నానిని ఆహ్వానించారు. అదే విధంగా ముమ్మట్టి..రజనీ కాంత్ ను ఆహ్వానించినట్లు విష్ణు చెప్పుకొచ్చారు.
ప్రకాశ్ రాజ్ వర్గం గైర్హాజరు..కోర్టుకు వెళ్లే ప్రయత్నాలు
అయితే, ఫోన్ ద్వారా ఆహ్వానించారా లేదా దాని పైన విష్ణు స్పష్టత ఇస్తేనే తెలిసే అవకాశం ఉంది. మోహన్ బాబు - విష్ణు ఆహ్వానించినా మెగా క్యాంపు నుంచి ఎవరూ హాజరు కాలేదా అనేది తేలాల్సి ఉంది. ఇక, తన ప్రత్యర్ధి ప్రకాశ్ రాజ్ తో సహా అందరినీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తానని విష్ణు రెండు రోజుల క్రితం చెప్పారు. అయితే, ప్రకాశ్ రాజ్ ...ఆయన ప్యానల్ సభ్యులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించ లేదు. వేదిక పైన మోహన్ బాబు పక్కనే నరేశ్ కార్యక్రమ పెద్దలుగా వ్యవహరించారు.
రాజీనామాల పై విష్ణు నిర్ణయం..ఆసక్తి కరంగా
ఎన్నికల అధికారి క్రిష్ణమోహన్ అధ్యక్షుడిగా విష్ణుతో పాటుగా కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, తొలి ఈసీ మీటింగ్ లో ఇప్పటికే రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ నుంచి గెలిచిన సభ్యుల అంశం పైన చర్చించే అవకాశం ఉంది. వారి రాజీనామాలు తిరస్కించి..వారితో సంధి కోసం ప్రయత్నిస్తారా..లేక, తమకు ఉన్న అధికారాలను వినియోగించి వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ప్రకాశ్ రాజ్ ఒక విధంగా ఎన్నికలు జరిగిన తీరు పైన న్యాయ పోరాటానికి సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇక, ఇప్పుడు "మా" కేంద్రంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.