ఎవరి రూట్ వారిదే: కెసిఆర్కు తలనొప్పి, పాలమూరు టీఆర్ఎస్ పాలిటిక్స్
తెలంగాణ ఏర్పాటైన తొలి దశలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని టీఆర్ఎస్ నేతలు ఐక్యత ప్రదర్శించినా.. జిల్లాల విభజన తర్వాత తమ పరిధిలో ఇతర జిల్లాల ఆధిపత్య రాజకీయమేమిటని ఎమ్మెల్యేలు.
హైదరాబాద్: పాలమూరు టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలపై ఆధిపత్యం సాధించే క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు ఊపందుకుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంత కాలం కలిసి ఉన్నట్లు నేతలు కనిపించినా.. తర్వాతర్వాత నూతన జిల్లాలు ఏర్పాటైన తర్వాత వారి మధ్య విభేదాలు పెరిగిపోయాయి.
జిల్లాల విభజన తర్వాత కూడా తమపై ఇతర జిల్లాల నేతల పెత్తనం ఎందుకనే అంతర్గత మథనం ఆయా నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి వర్గీయుల మధ్య గద్వాల జిల్లాలో తీవ్రమైన విబేధాలే గత వారం జరిగిన జెడ్పీ సమావేశంలో సభ్యులు నిరసన వ్యక్తం చేయడానికి కారణమనే వాదన వినిపిస్తోంది. ఇతర నియోజకవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు రగులుతోంది.
గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఎంపీ జితేందర్ రెడ్డికి, మంత్రి జూపల్లి క్రుష్ణారావుకు మధ్య కూడా సఖ్యత లేదని సమాచారం. ప్రభుత్వ, పార్టీ సమావేశాలు, సభల్లో అధికార పార్టీ నేతలు తమ ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులను బహిరంగంగానే నిలదీస్తున్న వైనం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తున్నది.
ఇప్పుడు కొందరికి జూపల్లి మద్దతు, మరికొందరికి నిరంజన్ అండ
మొదట్లో ఒకేమాట, ఒకేబాటగా ఉన్న గద్వాల జిల్లా టీఆర్ఎస్ నాయకులు క్రమక్రమంగా రెండుగా విడిపోయారని సమాచారం. అందులో ఒక వర్గం మంత్రి జూపల్లిని ఆశ్రయించగా, మరోవర్గానికి ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి అండదండలు అందిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో సైతం మంత్రి జూపల్లి కుమారుడు అరుణ్కుమార్ క్యాంపు ఏర్పాటు చేసి, కార్యకలాపాలు చేపడుతున్న విషయమై నిరంజన్రెడ్డి వర్గం గుర్రుగా ఉందనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా కొనసాగుతోంది. ఈ పరిణామాలు ఆ రెండు జిల్లాల్లో పార్టీని నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీల్చాయని, దీంతో తరచూ విబేధాలు బయటపడుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జడ్పీ సమావేశంలో చైర్మన్ బండారి భాస్కర్ని నిలదీసే వరకు పరిస్థితి వెళ్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జడ్పీ సమావేశంలో ఏదో జరుగుతుందనే ముందస్తు అంచనాతోనే సమావేశానికి మధ్యాహ్నం వరకు మంత్రి లక్ష్మారెడ్డి మినహా ఎప్పుడూ హాజరయ్యే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ రాలేదనే గుసగుసలు వినిపించాయి.
Recommended Video
మంత్రి జూపల్లిపై ఎంపీ జితేందర్ రెడ్డి ఇలా ఆగ్రహం
మరోవైపు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఎంపీ జితేందర్రెడ్డికి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. తనకు సమాచారం ఇవ్వకుండా అమరవీరుల స్తూపాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించడంపై ఆగ్రహించిన ఎంపీ జితేందర్రెడ్డి అదేరోజు సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టిమరీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లికి, ఎంపీ జితేందర్రెడ్డికి మధ్య ఈ రకంగా విభేధాలు బయటపడ్డాయి. ఇక మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ తనకు మంత్రి పదవి రాకుండా జిల్లాలోని కొందరు నాయకులు అడ్డుపడ్డారని తరచూ వ్యాఖ్యలు చేయడం, అదే క్రమంలో ఒక రోజు ఇదే విషయమై ఎంపీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బహిరంగంగానే బయట పడ్డారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడం తెలిసిందే. గెస్ట్హౌస్ ప్రారంభ సమయంలోనూ ప్రొటోకాల్ని పక్కనపెట్టి మంత్రులు, జడ్పీ చైర్మన్ తనని అమానించారని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ జడ్పీ సమావేశంలో మాట్లాడడం పార్టీలో విస్తృతమైన చర్చకు దారి తీసింది.
సెల్ టవర్లు ఎక్కుతున్న టీఆర్ఎస్ నేతలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలకు మధ్య పొసగని పరిస్థితి ఏర్పడింది. అసహనానికి లోనవుతున్న పాత క్యాడర్ సెల్టవర్లు ఎక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవల రైతు సమన్వయ సమితుల నియామకాల సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్కు చెందిన తనకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ మక్తల్ మండం మంతన్గోడ్ గ్రామ వాసి కృష్ణముదిరాజ్ సెల్టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తాజాగా నారాయణపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ సైతం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ శనివారం మరికల్లో సెల్టవర్ ఎక్కారు.
అనారోగ్యకరంగా పాలమూరు టీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు
నారాయణపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన శివకుమార్రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి మధ్య కూడా విభేదాలు తాజాగా బయటపడ్డాయి. శనివారం సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో శివకుమార్రెడ్డి తన అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు తాము కనిపించమని, కనీసం మంత్రికైనా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దామరగిద్ద మండలం క్యాతన్పల్లి విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా తనను వేదికపైకి ఆహ్వానించలేదంటూ టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్రెడ్డి మంత్రి లక్ష్మారెడ్డిని ప్రశ్నించారు. శివకుమార్రెడ్డిని వేదికపైకి ఆహ్వానించక పోవడంతో అతని వర్గీయులు తమ నాయకుడిని అవమానించారని శివకుమార్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. మొత్తంగా పాలమూరు జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆరోగ్యకరంగా లేవని, పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని సీనియర్లు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మహబూబ్నగర్ జిల్లాలో
మహబూబ్నగర్ జిల్లాలో తెరాస నాయకుల మధ్య విభేదాలు తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస చీఫ్ కె. చంద్రశేఖర రావుకు తలనొప్పిగా మారాయి. సామాజిక వర్గాల మధ్య విభేదాలుగా ఇవి రూపుమార్చుకునే ప్రమాదం కూడా ఉంది. కెసిఆర్ తాజా వ్యూహం వల్ల ఇప్పటి వరకు పార్టీలో ఉన్న ఓ సామాజిక వర్గం నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.