ఏంటిది: డిగ్గీ ఆగ్రహం, 'తెలంగాణ ప్రజలు మాత్రం మనకు ఓట్లేశారా'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గురువారం నాడు గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నేను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం సూచనలు అడిగితే, మీరు ఆరోపణలు చేసుకుంటారా అని మండిపడ్డారు.
గ్రేటర్ ఓట్ల తొలగింపుపై నేతల మధ్య విభేదాలు
గ్రేటర్ పరిధిలో పలు ఓట్లను తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై దిగ్విజయ్ సింగ్ ఎదుట గ్రేటర్ నేతలు వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రా ఓట్లు పోతే మంచిదేనని, వారి ఓట్లు తొలగిస్తే మనం గెలవొచ్చునని ఎమ్మెల్యే విష్ణు అభిప్రాయపడ్డారు.
దీనిపై మరికొందరు గ్రేటర్ నేతలు... విష్ణు వ్యాఖ్యలతో విభేదించారు. మనకు తెలంగాణ ప్రజలు మాత్రం ఓట్లు వేశారా అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. కాగా, గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం సూచనలు ఇవ్వాలని దిగ్విజయ్ నేతలను కోరారు. తన పైన ఫిర్యాదులపై దానం నాగేందర్... డిగ్గీకి వివరణ ఇచ్చారు.
పోటీ చేయను: వివేక్
వరంగల్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని పెద్దపల్లి మాజీ ఎంపి వివేక్... దిగ్విజయ్ సింగ్కు స్పష్టం చేశారు. నీ పైన ఒత్తిడి లేదని, పోటీ చేయాలనుకుంటే చెప్పమని వివేక్ను డిగ్గీ అడిగారు. దానికి.. తాను పోటీ చేయనని వివేక్ చెప్పేశారు.