కెసిఆర్ ఐదు కోట్ల బస్సుపై దిగ్విజయ్ సింగ్ కస్సుబుస్సు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అత్యధునాతనమైన హంగులతో ఐదు కోట్ల రూపాయల ఖరీదు చేసే బస్సును పొందడంపై కాంగ్రెసు నాయకులు భగ్గుమంటున్నారు. తాజాగా, దిగ్విజయ్ సింగ్ కెసిఆర్పై మండిపడ్డారు. ఐదు కోట్ల రూపాయల విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ బస్సు కెసిఆర్కు అవసరమా అని ఆయన అడిగారు.
ఎన్నికల హామీలను అమలు చేయడానికి నిధులు లేవు గానీ ఖరీదైన బస్సు కోసం మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆయన ఆయన ట్విట్టర్లో కెసిఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ తీరు నిజాం నవాబును మరిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
కెసిఆర్ ఏం వెలగబెట్టారని ముప్పు పొంచి ఉందని ఆయన విరుచుకుపడ్డారు. కెసిఆర్ మీద ఎవరు దాడి చేస్తారు, అసలెందుకీ అత్యధునాతనమైన బస్సు, కోట్లు ఖర్చు పెట్టి బస్సును కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటని తెలంగాణ కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా, కెసిఆర్ బస్సుకు శుక్రవారం యాదగిరిగుట్లలో పూజలు జరిగాయి. అక్కడ పూజలు చేసిన తర్వాత బస్సు చిలుకూరుకు వచ్చింది. హరితహారం కార్యక్రమంలో ఎక్కువగా కెసిఆర్ ఈ బస్సును వాడుతారని చెబుతున్నారు.