స్కైబాబపై దాడి: వారి ఉద్దేశ్యం స్పష్టమని కొణతం దిలీప్
Recommended Video
హైదరాబాద్: విజయవాడ పుస్తక మహోత్సవంలో తెలంగాణ రచయిత స్కైబాబపై పెల్లుబుకిన నిరసనపై తెలంగాణ ఐటి డైరెక్టర్ దిలీప్ కొణతం స్పందించారు. స్కైబాబకు ఫోన్ చేసి మాట్లాడారు.
స్కైబాబపై బెజవాడ దాడి: వారి వాదన ఇదీ, బూతు ఉందనే...
స్కై బాబ అంశంపై ఆయన ఫేస్బుక్ వేదికగా స్పందించారు. "ఈ రోజు సాయంత్రం (బుధవారం) విజయవాడ పుస్తక ప్రదర్శనలో జరగాల్సిన ఒక సమావేశంలో రచయిత స్కై బాబ మాట్లాడవలసి ఉన్నది. మధ్యాహ్నం మిత్రుడు నాయిని రవీందర్ రెడ్డికొన్ని ఆంధ్రా ప్రాంత ఫేస్బుక్ ప్రొఫైల్స్ మీద తెలంగాణ రచయిత స్కైబాబ మీద జరుగుతున్న ప్రచారం నా దృష్టికి తీసుకురాగానే వెంటనే స్కై బాబాతో ఫోన్ లో మాట్లాడి జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పాను" అని ఆయన రాశారు.
కవితపై వ్యతిరేకత ఉందని...
"తెలంగాణ ఉద్యమ సమయంలో స్కైబాబ రాసిన ఒక కవిత మీద వారికి వ్యతిరేకత ఉన్నదని సోషల్ మీడియాలో వారి ప్రచారం చూస్తే అర్థం అయ్యింది. సాయంత్రం దాదాపు వందమంది విజయవాడ బుక్ ఎక్జిబిషన్లో స్కై బాబా సభను జరగనీయకుండా అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ రద్దు అయ్యింది" అని దిలీప్ కొణతం చెప్పారు.
మూడున్నరేళ్లు అవుతోంది...
"విభజన జరిగి మూడున్నరేండ్లు అవుతుంది. ఆనాడు రెండువైపులా ప్రజ్వరిల్లిన ఆవేశాలు ఇవ్వాళ లేవు. తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అయితే ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారిపట్ల అత్యంత సుహృద్భావ వాతావరణం నెలకొల్పింది. ఒక్కోసారి ఇట్లాంటి ప్రవర్తన వల్ల తెలంగాణా ప్రాంత ప్రజల నుండే విమర్శలు ఎదుర్కొన్నది ఇక్కడి నాయకత్వం" అని దిలీప్ కొణతం అన్నారు.
టిడిపి వాళ్ల చర్య గర్హనీయం..
"ఇవ్వాళ (బుధవారం) విజయవాడలో జరిగిన సంఘటన - దాని ముందు కొంతమంది ఆంధ్ర ప్రాంత తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తల ప్రవర్తన అత్యంత గర్హనీయంగా ఉంది. విజయవాడలో జరిగే పుస్తక ప్రదర్శనకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కె. రామ చంద్ర మూర్తి, ఎన్. వేణుగోపాల్, పసునూరి రవీందర్, కె శ్రీనివాస్ లను పిలుస్తారా అంటూ వారు అక్కడి ప్రజలని రెచ్చగొడుతున్నారు" దిలీప్ కొణతం అన్నారు.
బుద్ధిజీవులు ఆలోచించాలి...
"అదేపని ఇక్కడి నాయకత్వం చేస్తే ఇక్కడున్న ఆంధ్రా ప్రాంత కళాకారులు, సాహిత్యకారుల పరిస్థితి ఏమిటో ఒకసారి బుద్ధిజీవులు ఆలోచించాలె. రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసుందాం అన్న ఉద్యమం నాటి కట్టుబాటును తెలంగాణా ప్రాంత నాయకత్వం తుచ తప్పకుండా పాటిస్తున్నది. ఇవ్వాళ విజయవాడ పుస్తక ప్రదర్శనలో పేట్రేగిన అల్లరి మూకలను వెంటనే నియంత్రించి, ఇటువంటి సంఘటన మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రాంత నాయకత్వానిది" అని దిలీప్ కొణతం అన్నారు.
వీరందరిపైనా..
"కత్తి మహేశ్, సుజాత సూరేపల్లి, స్కై బాబా - ఇట్లా మెజారిటీ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి తెలంగాణ అండగా నిలబడాలె. నిజమే! వారు అన్న ప్రతి మాటతో మనకు ఏకీభావం ఉండాల్సిన పనిలేదు. కానీ ఒక మెజారిటీ వర్గం మూకుమ్మడిగా జరిపే దాడులను మనం ఆదిలోనే నియంత్రించకపోతే అసలు భిన్నాభిప్రాయమే లేని ఒక Authoritarian వ్యవస్థ ఏర్పడుతుంది" అని దిలీప్ కొణతం అన్నారు. "అనేక దశాబ్దాల పాటు Tyranny of Majority ని ఎదుర్కొన్న సమాజంగా తెలంగాణ ఇటువంటి ఉద్యమకారులకు, రచయితలకు సంఘీభావం ప్రకటించాలె" అని కోరారు.
వారి ఎజెండా స్పష్టం...
"విభజన జరిగి మూడున్నర ఏండ్ల తరువాత ఆ పాత గాయాలను కెలుకుతున్న వారి ఎజెండా స్పష్టం. మొన్న తెలుగు మహాసభలు జరిగిన తీరు, తెలుగుకు తెలంగాణనే పుట్టినిల్లు అని విస్పష్టంగా ప్రకటించిన విధానం, సమైక్య రాష్ట్రంలో మరుగున పడ్డ వైతాళికులను స్మరించుకున్న పద్ధతి కొంతమందికి రుచించలేదు. దాని పర్యవసానమే ఇప్పుడు స్కై బాబా ఉద్యమ కాలంలో రాసిన కవితను వివాదాస్పదం చేయడం" అని అంటూ దిలీప్ కొణతం మరో పోస్టు పెట్టారు.
ఆనాడు బూతులు తిట్టలేదా..
"ఆనాడు మదరాసు నుండి విడిపోయేందుకు ఆంధ్రులు చేసిన ఉద్యమంలో అరవోళ్లను పచ్చి బూతులు తిట్టలేదా? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ కొన్నాళ్లకే ఆనాటి వైషమ్యాలు అన్నీ సమసిపోయినయి. సమైక్య పాలనలో నిలువెల్లా గాయాలైనా, వందలాది మంది బిడ్డలు రాలిపోయినా తెలంగాణా అవన్ని మరచిపోయి ఒక సుహృద్భావ వాతావరణంలో ఉండదల్చుకున్నది. తోబుట్టువుల్లా ఆంధ్ర సమాజంతో ఉండదల్చుకున్నామని ఇక్కడి నాయకత్వం చెప్పింది - ఆచరణలో చూపింది. ఎంతో ఆవేదనలో రాసిన కవితను వివాదం చేస్తున్నవాళ్లు ఒక్క సంగతి గుర్తుపెట్టుకోవాలె - లెక్కలే తేల్చుకుందామంటే తెలంగాణ ఎప్పుడూ సిద్ధమే!" అని దిలీప్ కొణతం అన్నారు.