ముగిసిన విందు, హోటల్కు ఇవాంకా, రాజ్కోట్కు ప్రధాని, రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ గౌరవార్థం మంగళవారం రాత్రి తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు ముగిసింది.
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ గౌరవార్థం మంగళవారం రాత్రి తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు ముగిసింది. అలాగే ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన కూడా ముగిసింది.
చదవండి: ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్న మోడీ, ఇవాంకా, కేసీఆర్.. ఇవాంకాకు రాయల్ ట్రీట్మెంట్, మొదలైన విందు
భాగ్యనగరంలో మంగళవారం మొదలైన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్(జీఈఎస్)లో ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. విందు సందర్భంగా ఇవాంకా ట్రంప్కు ప్యాలెస్ వద్ద రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చి స్వాగతం పలికారు.
అనంతరం ఫలక్నుమా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందులో ఇవాంకాతోపాటు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, ఇతర పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.
ఈ విందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, తెలుగురాష్ట్రాల నుంచి ప్రతాప్ సి.రెడ్డి, బీవీఆర్ మోహన్రెడ్డి, బ్రాహ్మణి, ఉపాసన, సంజయ్బారు, శోభనా కామినేని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విందులో దేశ, విదేశీ వంటకాలతోపాటు స్థానికంగా పేరుగాంచిన ప్రత్యేక వంటకాలను అతిథులకు వడ్డించారు. ప్యాలెస్లో నిజాం నవాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన 101 మంది ఒకేసారి భుజించగలిగే డైనింగ్ టేబుల్ పై ఇవాంకా సహా అతిథులంతా విందు ఆరగించారు.
విందు అనంతరం ఇవాంకా తిరిగి తాను బస చేస్తోన్న ట్రైడెంట్ హోటల్ కు తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు మెట్రో రైలు ప్రారంభం, జీఈఎస్ సదస్సులో పాల్గొనడంతో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన కూడా ముగిసింది.
దీంతో ఫలక్నుమా ప్యాలెస్లో విందు అయిపోగానే ప్రధాని మోడీ నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నించి ప్రత్యేక విమానంలో రాజ్కోట్కు బయలుదేరారు. మోడీకి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు వీడ్కోలు పలికారు.