బాస్టర్డ్.. భార్యాబిడ్డల్నీ ఆగం చేసిండు.. దిశ నిందితుడి భార్యతో ఆర్జీవీ భేటీ.. సంచలనల వ్యాఖ్యలు..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన ఆధారంగా 'దిశ' పేరుతోనే సినిమా తీస్తున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారం ప్రకటించారు. అందులో భాగంగా దిశ నిందితుల్లో ఒకరైన చింతకుంట చెన్నకేశవులు భార్య రేణుకతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు. ఆఫీసులో రేణుకతో మాట్లాడుతున్న ఫొటోను షేర్ చేసిన వర్మ.. దిశ, నిర్భయ ఉదంతాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
17 ఏళ్లకే తల్లి..
‘‘దిశ కేసులోని నలుగురు నిందితుల్లో ఒకడైన చింతకుంట చెన్నకేశవులు భార్య రేణుకను కలిశాను. తన 16వ ఏట ఆమెకు పెళ్లైంది. 17ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆ బాస్టర్డ్ చెన్నకేశవులు.. దిశతోపాటు తన భార్యాబిడ్డల్నీ బాధితులుగా మార్చాడు. రేణుకే చిన్నపిల్ల.. పైగా ఆమె ఇంకో పాపకు తల్లికాబోతోంది.. ఇద్దరి భవిష్యత్తూ ప్రశ్నార్థకంగా మారింది'' అని ఆర్జీవీ అన్నారు.
నిజాన్ని రేప్ చేసే సినిమా
రేణుకతో భేటీ కావడానికి ఒకరోజు ముందే వర్మ ‘దిశ' సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఆ సందర్భంలోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్భయ కేసులో నిందితుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ను రాక్షసుడితో పోల్చుతూ.. ‘‘ఆ రాక్షసుడు ఏపీ సింగ్ కొన్నేళ్లుగా కోర్టులతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడు. ప్రజలు మాత్రం సత్వర న్యాయాన్ని కోరుకుంటున్నారు. అందుకే దిశకు జరిగిన ‘న్యాయాన్ని' జనం సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ పరిణామాల వెనకున్న అసలు నిజాలను రేప్ చేయడానికే దిశ సినిమా తీస్తున్నా''అని దర్శకుడు వివరించారు.
‘ఇండియాస్ డాటర్' స్ఫూర్తితో?
2012నాటి నిర్భయ ఘటనపై బ్రిటిష్ ఫిలింమేకర్ లెస్లీ ఉడ్విన్ రూపొందించిన ‘ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీ అప్పట్లో పెనుదుమారం రేపింది. జైల్లో ఉన్న నిర్భయ నిందితులను, బయట వాళ్ల కుటుంబీకులను కూడా ఇంటర్వ్యూ చేసి, నేరానికి సంబంధించిన అవతలి కోణాన్ని కూడా ఆవిష్కరించేందుకు ఉడ్విన్ ప్రయత్నించారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘ఇండియాస్ డాటర్'డాక్యుమెంటరీని నిషేధించింది. ఆ టైమ్ లో ప్రభుత్వ చర్యను ఖండిచినవారిలో ఆర్జీవీ కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన తీయబోయే ‘దిశ' సినిమా.. ‘ఇండియాస్ డాటర్'లాగా అన్ని కోణాల్నీ చూపేలా ఉండొచ్చని తెలుస్తోంది.
క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లో మార్పులు..
గతేడాది నవంబర్ 28న వెలుగు చూసిన దిశ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. చివరికి దిశను చంపిన చోటే నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ కావడంతో ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. నేరస్తుల్ని చట్టవిరుద్ధంగా చంపడం కూడా నేరమే కాబట్టి ఆ ఎన్ కౌంటర్ పై విచారణ కొనసాగుతోంది. అయితే నిర్భయ కేసులో ఏళ్ల తరబడి పోరాడినా న్యాయం దక్కకపోవడం.. దిశ కేసులో మరోలా న్యాయం దక్కిందన్న భావన వ్యక్తం కావడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నేరస్తుల్ని చంపడం కరెక్టే అయినా.. నేరానికి దారితీసే పరిస్థితుల్ని కూడా మార్చుకోవాలన్నది వర్మతోపాటు చాలా మంది చేస్తోన్న వాదన. ఇవే అంశాలను ‘దిశ' సినిమాలోనూ చూపెడతారా లేదా అనేది విడుదల వరకు వేచిచూడాలి.