179 కిలోల డ్రగ్స్: హైదరాబాద్లో మళ్లీ కలకలం.. ఇద్దరి అరెస్ట్..
కంపెనీపై దాడి చేసిన అధికారులు 179 కిలోల ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 5 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ను షేక్ చేసిన డ్రగ్స్.. రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడా బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా బొల్లారంలో భారీ డ్రగ్స్ దందా వెలుగుచూసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల దాడులతో డ్రగ్స్ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ శివారు ప్రాంతమైన బొల్లారంలో ఓ కంపెనీ కేంద్రంగా డ్రగ్స్ దందా జరుగుతున్నట్టు ఇంటలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ కంపెనీపై దాడి చేసిన అధికారులు 179 కిలోల ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 5 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దాడుల సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వీరిద్దరిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముందన్నారు. కాగా, ఇదే ప్రాంతంలో గతంలోను డ్రగ్స్ వెలుగుచూసినట్టు తెలుస్తోంది.
కంపెనీకి ఎటువంటి పేరు లేదని, రూ. 2 లక్షలకు 15రోజుల పాటు రియాక్టర్ ను లీజుకు తీసుకున్న వ్యక్తులు ఎపిడ్రిన్ ను తయారు చేశారని ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు. ఎపిడ్రిన్తో పాటు మెటామిథామైన్ను కూడా వీరు తయారు చేస్తున్నారని తెలిపారు. రానున్న కొత్త సంవత్సరం వేడుకల్లో పెద్ద ఎత్తున విక్రయించాలన్న ఉద్దేశంతోనే ఈ డ్రగ్స్ దందాకు తెరలేపినట్టు పోలీసులు గుర్తించారు.