వరంగల్, కరీంనగర్లో విపత్తు నిర్వహణ విభాగాలు: త్వరలో అన్ని కార్పొరేషన్లలోనూ
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో విపత్తు నిర్వహణ విభాగాలు(డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతి నగరంలో అనుకోని ప్రమాదాలను, విపత్తులను ఎదుర్కోనేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖాధికారులను అదేశించారు.
ముందుగా స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా ఉన్న వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో తొలిదశలో విపత్తు నిర్వహణ విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విపత్తు నిర్వహాణ విభాగం సమర్ధవంతంగా పనిచేస్తోందని.. ఇదే ప్రయత్నాన్ని ఇతర కార్పొరేషన్లకు విస్తరిస్తామన్నారు.
ఆ తర్వాత దశలవారీగా అన్ని కార్పొరేషన్లకు విస్తరించున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఈ నగరాల్లో జరిగే అనుకోని ప్రమాదాలు, విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడమే లక్ష్యమని తెలిపారు. వరదలు, భారీ వర్షాలు, భవన నిర్మాణ ప్రమాదాల్లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాలు సహాయకంగా ఉంటాయని తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో భవన నిర్మాణ వ్యర్ధాలు, చెత్త వేయడం, పుట్ పాత్ల ఆక్రమణ వంటి ఉల్లంఘనల నియంత్రణను కూడా ఈ విభాగం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రతి నగరంలో విపత్తు నిర్వహణ విభాగం ఏర్పాటు పైన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖాధికారులకు మంత్రి అదేశించారు.
మంత్రి ఎర్రబెల్లితో కలిసి హైదరాబాద్ నగర సెంట్రల్ విజిలెన్స్ సెల్, మోబైల్ యాప్ అవిష్కరించారు కేటీఆర్. భారీ వర్షాల నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కొనేందుకు చక్కగా పనిచేస్తున్నారని జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్సును మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.
జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ దళం చేపట్టిన కార్యక్రమాలు, వాటికి ప్రజల నుంచి వస్తున్న స్పందన.. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరం అయిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ విభాగం వేగంగా పనిచేస్తుందని, చాలా చోట్ల మొబైల్ టీంలను ఏర్పాటు చేశామని డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి మంత్రికి తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే ఉల్లంఘనల నిర్వహాణను అన్లైన్ చేసేందుకు వీలు కల్పించే సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్, మొబైల్ అప్లికేషన్ను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఆవిష్కరించారు. వీటి ద్వారా అక్రమంగా భవన నిర్మాణ వ్యర్ధాల పారవేత, చెత్త వేయడం, పుట్పాత్ల అక్రమణ మొదలైన ఉల్లంఘనలు, జరిమానాలను ఈ యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహించవచ్చు.
అంతేగాక, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ దళంలోని ఉద్యోగుల ప్రమాద భీమా, అరోగ్య భీమా సౌకర్యాన్ని సైతం శుక్రవారం మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, హైదరాబాద్ కమీషనర్ లోకేష్ కూమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.