'కోర్టుల కంటే చర్చలకే ప్రాధాన్యత,' జలవివాదాలకు చెక్ కు కెసిఆర్ ఇలా...
జలవివాదాలను చర్చించుకోవడం ద్వారానే పరిష్కరించుకోవడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. కోర్టుల చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్:నీటి పంపకాల కోసం కోర్టుల చుట్టూ తిరగడం కన్న కలిసి కూర్చోని మాట్లాడుకోవడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని తెలంగాణ సిఎం కెసిఆర్ చెప్పారు.జల వివాదాలను పరిష్కరించుకొనేందుకు ఇదే ఉత్తమమైన మార్గమన్నారు కెసిఆర్.
కృష్ణానది జలాల పంపకాలపై కేంద్రం ఏర్పాటుచేసిన బజాజ్ కమిటీ బుధవారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసింది.
జలవివాదాలు వాంఛనీయం కాదన్నారు కెసిఆర్, ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చన్నారు.
ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి నివియోగానికి సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలన్నారు. అంతకుముందు హైద్రాబాద్ జలసౌధలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో బజాజ్ కమిటీ సమావేశమై ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలను విన్నది.
తెలంగాణలోని జూరాలను ఉమ్మడి ప్రాజెక్టుల పరిధిలోకి తీసుకురావాలని ఎపి అధికారులు కోరారు.దీనికి తెలంగాణ అధికారులు అంగీకరించలేదు. పులిచింతల, సుంకేసులను ఉమ్మడి ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ అధికారులు కోరారు.
దీనికి ఎపి అధికారులు అభ్యంతరం తెలిపారు. ఇరు రాష్ట్రాల వాదనలపై కేంద్రానికి బజాజ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. చర్చల ద్వారానే జలవివాదాలను పరిష్కరించుకోవచ్చని తెలంగాణ సిఎం ప్రకటించారు.