దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి కురమయ్య మృతిచెందారు. చెన్నకేశవులు ఎన్కౌంటర్ జరిగిన కొద్దిరోజులకు ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్నాళ్లు చికిత్స పొందిన ఆయన్ను ఇటీవలే స్వగ్రామం నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనే ఆయన మృతి చెందారు.
ఇంటిని పోషించే చెన్నకేశవులు,కురమయ్య ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే చెన్నకేశవులు భార్య రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెకు ఆర్థిక సాయం చేయాలంటూ ట్విట్టర్లో విజ్ఞప్తి కూడా చేశారు.
కాగా, హైదరాబాద్ శివారు శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ దిశపై నలుగురు వ్యక్తులు అత్యాచారం,హత్య చేసిన సంగతి తెలిసిందే. టోల్ ప్లాజా వెనకాల ఆమెపై అత్యాచారం తర్వాత చటాన్పల్లి అండర్ పాస్ సమీపంలో ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి కాలబెట్టారు. ఇందులో చెన్నకేశవులు ఏ4 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్, ఎన్కౌంటర్ ఇలా అన్నీ చక,చకా జరిగిపోయాయి.
Recommended Video
సీన్రీకన్స్ట్రక్షన్లో భాగంగా నిందితులను చర్లపల్లి జైలు నుంచి చటాన్పల్లి వద్దకు తీసుకెళ్లగా.. వారు పోలీసుల పైకి తిరగబడటంతో ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఇది ఫేక్ ఎన్కౌంటర్ అన్న ఆరోపణలతో మానవ హక్కుల కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. దీనిపై మానవ హక్కుల కమిషన్ విచారణ ఇంకా కొనసాగుతోంది.