మళ్లీ వార్తల్లోకి ఎక్కిన డాక్టర్ దిశ హత్యాకాండ: ఆరా తీస్తోన్న ఆర్జీవీ: పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నలుగురు కామాంధుల క్రూరత్వానికి బలి అయిన దిశ హత్యాకాండపై వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఆరా తీస్తున్నారు. ప్రతి అంశంపైనా పరిశోధన చేస్తున్నారు. దీనికోసం ఆయన ఏకంగా శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. శంషాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్తో భేటీ అయ్యారు.
అత్యాచారం..హత్య..ఎన్కౌంటర్.. !
వెటర్నరీ డాక్టర్ దిశ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై, కన్నుమూసిన ఘటన యావత్ దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే. ఈ కిరాతకానికి పాల్పడిన మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్ జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులును సైబరాబాద్ పోలీసులు గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన ఎన్కౌంటర్ చేశారు. వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం ఒక ఎత్తయితే.. నిందితుల ఎన్కౌంటర్ మరో ఎత్తయింది. ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
దిశ హత్యోదంతంపై మూవీ..
దిశ అత్యాచారం, హత్యకు గురి కావడం, నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం.. ఈ పరిణామాలన్నింటినీ రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. దిశ హత్యాకాండపై పాన్ ఇండియా మూవీ తీయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్నిఆర్జీవీ ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఇది స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ మూవీ కోసం ఆయన పకడ్బందీగా స్క్రిప్ట్ను రూపొందించే పనిలో పడ్డారు. ఆ ఉద్దేశంతోనే ఆయన శంషాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు.
పాన్ ఇండియా మూవీగా..
దిశ హత్యోదంతాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు రామ్గోపాల్ వర్మ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్కు చేరుకున్న విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక విలేకరులు ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రామ్గోపాల్ వర్మ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అత్యంత సున్నితమైన అంశం కావడం వల్ల స్క్రిప్ట్ను జాగ్రత్తగా రూపొందించాల్సి వస్తోందని అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉందని అన్నారు. ఈ వర్క్ పూర్తయిన వెంటనే సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తామని అన్నారు.
Recommended Video
కుటుంబ సభ్యుల అనుమతి అవసరం లేదు..
తాను స్వతంత్రంగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నానని, దీనికోసం ఎవరి అనుమతిని కూడా తీసుకోవాల్సి వస్తుందని అనుకోవట్లేదని రామ్గోపాల్ వర్మ చెప్పారు. దిశ కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉండకపోవచ్చని అభిప్రాయ పడ్డారు. దిశ జరిగిన అన్యాయాన్ని మరే ఆడపిల్లకు జరగకూడదని భావించే వారిలో తాను ఒకడినని, అలాంటి దురాగతాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికే ఈ సినిమాను సందేశాత్మకంగా తెరకెక్కించబోతున్నానని అన్నారు. వీలైతే తాను దిశ కుటుంబ సభ్యులను కూడా కలుస్తానని అన్నారు.