చావు బతుకుల మధ్య దిశా కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి
స్వయంకృత అపరాధం ఆ కుటుంబంలో కొడుకును కడతేరిస్తే , రోడ్డు ప్రమాదం తండ్రిని చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడేలా చేసింది.దిశ ఘటన యావత్ భారత దేశాన్ని కదిలించింది. షాద్ నగర్ వద్ద దిశను సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది .
ఈ ఘటన జరిగిన తర్వాత దిశా హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. మొన్నటి వరకు వారి మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలోనే ఉండగా ఇటీవలే వారి మృతదేహాలను ఖననం చేశారు. ముఖ్యంగా నిందితుల కుటుంబ సభ్యుల్లో చెన్నకేశవులు భార్య గర్భవతి కావటం , ఆమె తన భర్తతో పాటే తనను చంపెయ్యమని ఆందోళన చెయ్యటం చర్చనీయాంశం అయ్యింది. ఇక ఇదే కుటుంబాన్ని ఇప్పుడు మరో విషాదకర సంఘటన కలచివేస్తుంది.
దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య ఈ రోజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నారాయణ పేట్ జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య ప్రయాణిస్తున్న బైక్ ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో కూర్మయ్య కు తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య అలియాస్ కూర్మప్ప తన స్వగ్రామమైన గుడిగుండ్ల నుంచి బండిపై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
దిశా కేసులో కొత్త కోణం .. చెన్నకేశవులు భార్య మైనర్ .. 13 ఏళ్లే అని గుర్తించిన అధికారులు
కూర్మయ్యను తొలుత మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, అతన్ని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఈ ప్రమాదం తరువాత సదరు పోలీసు అధికారిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేశారన్న సెక్షన్ పై కేసు నమోదు చేశారు. ఓ వైపు కొడుకు చావు మరిచి పోకముందే తండ్రి చావు బతుకుల మధ్యన ఉండడం ఆ కుటుంబాన్ని విషాదంలో మునిగిపోయేలా చేసింది.