చిట్టీల వివాదం: ఒక మహిళ గొంతు కోసి.. భయంతో మరో మహిళ ఆత్మహత్య!
సంగారెడ్డి: చిట్టీల విషయంలో రేగిన వివాదం ప్రాణాల మీదికి తెచ్చింది. ఆవేశం పట్టలేక ఓ మహిళ మరో మహిళ గొంతు కోసేసింది. ఆ తరువాత భయపడి తను కూడా ఇంట్లోకి వెళ్లి ఊరేసుకుంది.
కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు మండలం బీడీఎల్ టౌన్షిప్లోని 321 క్వార్టర్లో అనిత, హిమసుధలు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఇరువురి భర్తలు కూడా బీడీఎల్లో ఉద్యోగం చేస్తున్నారు.
ఈ మధ్యన అనిత, హిమసుధలు చిట్టీల వ్యాపారంలోకి దిగారు. చిట్టీల విషయంలోనే వారిరువురి మధ్య గొడవ జరిగింది. హిమసుధ ఆవేశం పట్టలేక అనిత గొంతు కోసి మట్టుబెట్టేయత్నానికి పాల్పడింది. తీరా చేశాక భయపడిపోయింది.
తన క్వార్టర్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనితను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై భానూరు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.