కూకట్ పల్లిలో గులాబీ కొట్లాట..! సొంతగూటి ఎమ్మెల్యేను ఓడించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సై..!!
హైదరాబాద్: తెలంగాణలో వర్గ పోరు తారా స్థాయిలో నడుస్తోంది. అసమ్మతులను అదిష్టానం ఎంత బుజ్జగించినా పైకి చల్ల బడ్డట్టు కనిపిస్తున్నా లోలోన మాత్రం అగ్నిపర్వతంలా రగిలిపోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేల పై బహిరంగ ఆరోపణలు చేయడంతోపాటు రాబోవు ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామంటూ సవాల్ విసురుతున్నారు. దీంతో ప్రథమ శ్రేణి నాయకత్వం ద్వితీయ శ్రేణి నాయకత్వం మద్య ప్రశ్చన్న యుద్దం నెలకొంది. అందరూ కలిసి పార్టీ విజయం కోసం పనిచేయాల్సింది పోయి పొంత పార్టీలోనే వ్యతిరేక గళం వినిపిస్తున్నారు నాయకులు. గులాబీ పార్టీలో రెండవ తరగతి నాయకులంతా ప్రస్తుత మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపైన, మంత్రులపైన అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా ఉండే కూకట్ పల్లి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు, కార్పోరేటర్ కావ్య భర్త హరీష్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే రేంజ్ లో యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్నారు.
కూకట్ పల్లిలో నువ్వెంత అంటే నువ్వెంత..! మాధవరం, హరీష్ రెడ్డి ల మద్య యుద్ద వాతావరణం..!!
టీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఖాయమైంది. చాలా చోట్ల పార్టీపైన తిరుగుబాటుకు నేతలు రెఢీ అవుతున్నారు. టిక్కెట్ ఆశించి భంగపడిన నాయకులు ఒక్కొక్కరు పార్టీని వదిలిపెట్టి ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకుంటున్నారు. కేటీఆర్ బుజ్జిగింపుల పర్వం కొనసాగుతుండగానే నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి పోటీకి సై అంటున్నారు. ప్రధానంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట తిరుగుబాటు బెడద ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణతో పాటు తెలుగువారందరు ఆసక్తిగా చూసే కూకట్ పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు రెబల్ అభ్యర్థి ఖాయమయ్యారు.
మాధవరం క్రిష్ణారావును వ్యతిరేకిస్తున్న కూకట్ పల్లి టీఆర్ఎస్ శ్రేణులు.. !!
పార్టీ ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావుకు టిక్కెట్ ఖరారు చేయడంతో అసమ్మతి రాజకీయాలు మొదలయ్యాయి.తెలుగుదేశం పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఆయనకే పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతో పాత గులాబీ నేతలు ఆందోళనగా ఉన్నారు.మాధవరాన్ని మార్చాల్సిందేనని నాయకులు పట్టుపడుతున్నారు. ఇదే సమయంలో ఆయనకు టిక్కెట్ ఖరారు చేయడంతో పార్టీలో చీలిక వచ్చింది. కూకట్ పల్లిలో బలమైన నాయకుడు హరీష్ రెడ్డి టీఆర్ఎస్ పైన తిరుగుబాటు ప్రకటించారు. ఆ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
పార్టీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ..! పార్టీ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న హరీష్ రెడ్డి..!!
తాజాగా కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో బహిరంగం సభ నిర్వహించి తన సత్తా చాటారు. ప్రజల ఆశ్వీరాధంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు హరీష్ రెడ్డి ప్రకటించారు. ఇండిపెండెంట్ గా గెలిస్తే కచ్చితంగా మంత్రిని అవుతానని కూడా ఆయన స్పష్టం చేయడం విశేషం. మరో వైపు టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం క్రిష్ణారావు పైన హరీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. కనీసం ఆరో తరగతి కూడా చదవని వ్యక్తిని ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపిస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా భూకబ్జాలకు పాల్పడ్డారని, చెరువులను ఆక్రమించుకున్నాడని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని హరీష్ రెడ్డి నిప్పులు చెరిగారు.
కూకట్ పల్లిలో గెలుపు తనదే అంటున్న హరీష్ రెడ్డి..! కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి కూడా సై..!!
మొత్తానికి కూకట్ పల్లిలో టీఆర్ఎస్ పార్టీకి రెబల్ అభ్యర్థి ఖరారైయ్యాడు. టీడీపీ లేదా కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తే ఆ పార్టీల్లో చేరడానికి హరీష్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు.పొత్తుల్లో భాగంగా కూకట్ పల్లి టిక్కెట్ దాదాపుగా తెలుగుదేశం పార్టీకే ఖరారైంది. టీడీపీ నుంచి పోటీచేయడానికి పలువురు నేతలు సిద్ధమౌతున్న నేపథ్యంలో హరీష్ రెడ్డిని ఆ పార్టీ చేర్చుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరో వైపు హరీష్ రెడ్డి పోటీ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం క్రిష్ణారావు పరిస్థితి ఇబ్బందికరంగా మారబోతోంది.టీఆర్ఎస్ ఓట్లలో గట్టి చీలిక వచ్చే అవకాశాలున్నాయి. ఆ పార్టీకి పట్టున్న బస్తీల్లో హరీష్ రెడ్డికి మంచి పట్టుంది. ఇక కాలనీల్లో ఎక్కువ శాతం తెలుగుదేశానికి అండగా నిలిచే ఛాన్స్ ఉంది. దీంతో మాధవరం విజయం అంత సులువు కాదని అర్థమౌతోంది.
Recommended Video