గులాబీ పార్టీలో నివురు గప్పిన నిప్పులా అసంత్రుప్తులు.. !
Recommended Video
హైదరాబాద్: గులాబీ పార్టీలో అసంత్రుప్తుల తీరు నివురుగప్పిన నిప్పులా పరిణమించింది. ఎప్పుడు అగ్నిగుండంగా మారి పార్టీని దహించివేస్తుందో ఎవ్వరి అంతుచిక్కని ప్రశ్నలా తయారయ్యింది. ఇప్పటికే ఇద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఓ ఎం.పి కూాడా రాజీనామా చేయనున్నారు. డజన్ల కొద్ది సీనియర్ నాయకులు అలక పాన్పు మీదున్నారు. ఇక టిక్కెట్ ఆశించి భంగపడిన అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ సారి టిక్కెట్ రాకపోతే తమ రాజకీయ భవిష్యత్తు గల్లంతు కావడం ఖాయమని నమ్ముతున్న నాయకులు మాత్రం పట్టుదలతో ఉన్నారు. ఈ సారి తమ వారసత్వానికి టిక్కెట్లు ఇప్పించుకొని నియోజకవర్గాలను కాపాడుకోవాలని భావించిన వారికి కేసీఆర్ హ్యాండ్ ఇచ్చారు. ఇలాంటి వారిలో డిప్యూటీ సి.ఎం కడియం శ్రీహరి,టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు ఉన్నట్లు సమాచారం.
కడియం, కేశవరావు ది ఒకే బాట..! డాటర్లకి టికెట్ల ఇక్కట్లు..!!
ఈ సారి స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ తనకేనని కడియం భావించారు. ఒక వేళ తనకు కాకపోయినా తన కుమార్తె కు అవకాశం వస్తుందని నమ్మారు. కడియాన్ని కాదని రాజయ్యకు కేసీఆర్ సీటు కన్ఫమ్ చేశారు. దీంతో ఉప ముఖ్యమంత్రి షాక్ కు గురయ్యారు. కనీసం తన కుమార్తెకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో రాజకీయంగా భవిష్యత్తు ఏమిటన్న భయం ఆయనను పట్టుకున్నట్లు చెపుతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ గెలిచినా తనను మళ్లీ ఎమ్మెల్సీ చేసి మంత్రి వర్గంలో కొనసాగిస్తారన్న నమ్మకం కడియంలో లేదని సమాచారం. కేటీఆర్ సి.ఎం అయితే తనను పక్కన పెడతారని ఆయన భావిస్తున్నారట. అందుకే ఈ సారి ఏదో విధంగా టిక్కెట్ సంపాదించి ఎమ్మెల్యే కావడం ద్వారా నియోజకవర్గాన్ని దక్కించుకోవచ్చునని కడియం భావించినా ఆయన ప్రయత్నాలు నేరవేరలేదు. స్టేషన్ ఘన్ పూర్ లో ఓ మహిళా కార్యకర్తతో ఆయన మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో ఇక టిక్కెట్ తమకేనని కడియం భావించారు. కాని కేసీఆర్ మాత్రం మరోలా ఆలోచించారు.
జనగాం పై కడియం ఆశలు గల్లంతు..! తానేంటో చూపిస్తానంటోన్న కడియం..!!
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని తన దూతగా నియోజకవర్గానికి పంపించి రాజయ్యను మార్చేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ నాయకులంతా నిరసనలు ఆపి అభ్యర్థి కోసం పనిచేయాలని స్పష్టం చేశారు.దీంతో కడియం చిన్న బుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అక్కడక్కడా కనిపించినప్పటికి ఆయనలో ఉత్సాహం మాత్రం లేదు. పార్టీ నాయకత్వం కనీస సమాచారం ఇవ్వకపోవడం,ఆ తర్వాత కూడా మాట్లాడకపోవడంతో కడియం తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెర వెనుక నుంచి కడియం ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. నిరసనలు ఆపాలని కేసీఆర్ ఆదేశించినప్పటికి ఆయన మాత్రం తన అనుచరులతో పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నారు.
కేసీఆర్ దిగిరాకపోతే పార్టీ కి నష్టమే..! పార్టీ మారేందుకు సన్నాహాలు..!!
తాజాగా జఫర్ ఘడ్ మండలంలో రాజయ్యకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు భారీ సభ నిర్వహించి అభ్యర్థిని మార్చాల్సిందేనని స్పష్టం చేశారు. దీని వెనుక కడియం ఉన్నట్లు భావిస్తున్నారు. పార్టీ నాయకత్వంతో అమీతుమీ తేల్చుకోవాలన్న పట్టుదలతోనే కడియం శ్రీహరి ఈ రాజకీయం చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ దిగిరాకపోతే పార్టీ మారాలనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు గత రెండు మూడు రోజుల నుంచి ఊహగానాలు మొదలయ్యాయి. ఇది ప్రాథమిక దశ మాత్రమే అయినప్పటికి డిప్యూటి సి.ఎం స్థాయి నాయకుడి లో ఇలాంటి ఆలోచన రావడం నిజంగా టీఆర్ఎస్ కు ఇబ్బందికరమైన పరిణామమే. మరి ఈ వ్యవహారాన్ని గులాబీ బాస్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
కేసీఆర్ తీరుతో రగిలిపోతున్న సీనియర్లు..! సమయం వచ్చినప్పుడు స్పందిస్తామంటున్న నేతలు..!
మరో వైపు పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారం. ఖైరతాబాద్ టిక్కెట్ తన కుమార్తెకు ఇప్పించుకోవడానికి కేకే భావించారు. కాని ఈ సీటు దానం నాగేందర్ కు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కేకే ను కేటీఆర్ బుజ్జగించారు. అయినప్పటికి కేశవరావు లోలోన రగిలిపోతున్నట్లు చెపుతున్నారు. కేసీఆర్ తీరు పైన సన్నిహితుల వద్ద మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కేకే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికి ఆయన మాత్రం ఇదివరకటిలా కేసీఆర్ కు విధేయత చూపించడం కష్టమేనని చెప్పాలి. ఇక మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కూడా పార్టీ అధినేత తీరు పట్ల అసంత్రుప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. డోర్నకల్ టికెట్ ఆశించి బంగపడ్డ సత్యవతి కూడా నేడో రేపో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.