అధికార గులాబీ పార్టీలో అసంత్రుప్తి సెగలు..!!
అదికార గులాబీ పార్టీలో అసంత్రుప్తుల సెగ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉద్యమ సయమంలో నిద్రాహారాలు మానేసి పని చేసిన తమకు సముచిత స్థానం కల్పించకపోగా ఇప్పుడు తమను కలిసేందుకు కూడా ఎందుకు నిరాకరిస్తున్నారని సెకండ్ గ్రేడ్ నేతలు కేసీఆర్ కుటుంబాన్ని నిలదీస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు కేసులను సైతం లెక్క చేయకుండా జీవితాలను తెలంగాణ కోసం పణంగా పెట్టిన తమను గుర్తించకుండా అలసత్వం వహించడం ఎంతవరకు సమంజసమని ఉద్యమంలో పాల్గొని సరైన గుర్తింపు పొందలేని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కోణాన్ని పక్కన పెడితే వ్యక్తిగత సమస్యలను సైతం చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడం దారుణంగా అభివర్ణిస్తున్నారు నాయకులు. తెలంగాణ కోసం చేసిన తమ త్యాగానికి గుర్తింపు ఇవ్వనప్పుడు వచ్చే ఎన్నికల్లో అదికారం లోకి వస్తే ఎంత రాకపోతే ఎంతని ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
సిసలైన ఉద్యమకారులకు గుర్తింపు ఎక్కడ..? గులాబీ బాస్ పద్దతి మారాలంటున్న ఉద్యమకారులు..!
త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో, తెలంగణా ఉద్యమంలో పాల్గొన్న నిఖార్సయిన నాయకులకు సముచిత స్థానం కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కేసీఆర్ విఫలం చెందినట్టు నిర్ధిరణ అవుతోంది. విద్య, ఉద్యోగాలనే కాకుండా కుటుంబసభ్యులను కాదంటూ ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న తెలంగాణ ఉద్యమంలో ఉప్పెనలా పాల్గొన్న తెలంగాణ యువత ప్రస్తుతం అసహనంతో కాలం వెళ్లదీసే పరిస్థితులు నెలకొన్నాయి. తలంగాణ ఉద్యమంలో ఎదురైన సమస్యలన్నీ తెలంగాణ కల సాకారంతో సమసి పోతాయని భావించిన యువత కల కలగానే మిగిలి పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో పాల్గొని కేసుల్లో ఉరుక్కున్న తమను పట్టించుకునే నాథుడే స్వతంత్ర్య తెలంగాణాలో కరువయ్యాడని బిక్కుబిక్కుమంటున్నారు.
యువతకు ఉపాది అవకాశాలు మ్రుగ్యం..! ఎందుకు ఈ జాడ్యం..?
నీళ్లు, నిధులు, నియామకాల సిద్దాంతంతో వచ్చిన తెలంగాణ లో నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు చేయూత ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన టీఆర్ ఎస్ పార్టీ, తెలంగాణ కల సాకారం అయిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్న యువతకు కనీసం ఉపాధి కల్పించలేకపోయిందని ప్రభుత్వం పై తెలంగాణ యువత మండిపడుతోంది. ఉద్యమంలో పాల్గొన్న తమకు రాజకీయ అవకాశం వస్తుందని ఆశించి, ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికి ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో కేసులలో ఇరుక్కున్నయువత ఇప్పటికీ కోర్టుల చుట్టు ప్రదక్షిణలు చెయ్యాల్సిన దౌర్బాగ్యం నెలకొందని చెప్పుకొస్తున్నారు.
తెలంగాణ కోసం ప్రాణాలు ఒదిలాం.. ఐనా గుర్తింపు లేదంటున్న కుటుంబాలు..
తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న తమ కుటుంబాలకు సరైన గుర్తింపు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అమరవీరుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ముందు ఎలాంటి పరిస్తితులు నెలకొన్నాయో తెలంగాణ సాకారమైనా తర్వాత కూడా అలాంటి పరిస్థితులే సాక్షాత్కరిస్తున్నాయని ఉద్యమకారుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయి దిక్కుమొక్కులేని దీన స్థితిలో ఉన్న తమకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందా అనుకుంటే అది కూడా లేదని తెలంగాణ కోసం అసువులు బాసిన కుటుంబాలు రోదిస్తున్నాయి. కంటితుడుపు చర్యగా కొన్ని కుటుంబాలకు ఎంతో కొంత చేసి అన్నికుటుంబాలను ఆదుకున్నామని చెప్పడం సరైన చర్యకాదని ప్రభుత్వాన్ని అమరవీరుల కుటుంబాలు విమర్శిస్తున్నాయి.
ఇప్పటికైనా గుర్తింపు ఇవ్వాలి.. లేకపోతే మరో ఉద్యమం తప్పదంటున్న ఉద్యమకారులు..
తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా ఉద్యమంలో పాల్గొన్నందుకు తమ కుటుంబాలకు రాజకీయ ప్రోత్సాహం ఇవ్వకుండా తెలంగాణ ను వ్యతిరేకించిన వారిని అందలం ఎక్కించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసులు కొట్లాటలు తమవైతే అదికారం అందలం వేరేవారిదా అంటూ నిరాశా నిస్ప్రుహను వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో పాల్గొన్న కొంత మంది నాయకుల నోటికి భయపడి, అంతర్గత విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు పనికిరాని నామినేటెడ్ పదవులు అంటగట్టారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లో నోరు ఉన్నోడిదే ఊరు అన్న చందంగా తయారయ్యిందని, నోరున్నోడికే అదికారం కట్టబెడుతున్నారు తప్ప నిజమైన తెలంగాణ వాదులకు కాదని సెకండ్ గ్రేడ్ నాయకులు మండిపడుతున్నారు. సెకండ్ గ్రేడ్ నాయకత్వానికి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఎందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వడంలేదో ముందుగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అర్థాంతరంగా పార్టీలోకి వచ్చి బంగారు తలెంగాణ పేరు చెబుతూ పబ్బం గడుపుకొస్తున్న నాయకులకే సీట్లు కేటాయిస్తే సిసలైన ఉద్యమకారులను నుండి అదికార గులాబీ పార్టీకి ప్రతిఘటన ఎదుకుకాక తప్పదని హెచ్చరిస్తున్నారు తెలంగాణ సిసలైన ఉద్యమకారులు.