కేసీఆర్-కేకే, డీఎస్లకు చెడిందా? దూరం పెట్టారా?: ఏం జరిగిందంటే?
కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కొందరు నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కొందరు ఉద్యమ సమయంలో మరి కొందరు తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కొందరు నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కొందరు ఉద్యమ సమయంలో మరి కొందరు తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావు మొదట తగిన ప్రాధాన్యతే ఇచ్చారు. కానీ, ఈ మధ్య కాలంలో వారిని పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
కేకేకు ఘనస్వాగతం, కానీ..
ఆ వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందే కాంగ్రెస్పార్టీకి గుడ్బై చెప్పి సీనియర్ నేత కేశవరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన స్థాయికి తగ్గట్టుగానే పార్టీలో సెక్రటరీ జనరల్ పదవిని కట్టబెట్టారు కెసీఆర్. అప్పటినుంచి పార్టీకి సంబంధించిన ఏ అంశాన్ని అయినా కేకేతో చర్చించే కెసీఆర్ ఇటీవల ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. అధికార పార్టీ వర్గాల్లోనూ ఈ చర్చ జరగడం గమనార్హం.
మియాపూర్ భూముల ఎఫెక్ట్?
కాగా, మియాపూర్ భూకుంభకోణం ఆ మధ్య ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశవరావు కూడా అసైన్లాండ్స్ కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో కేకే ఇరకాటంలో పడటం.. తర్వాత ఆ భూములు ప్రభుత్వపరం కావడం చకచకా జరిగిపోయాయి.
కేకే ప్రాధాన్యత తగ్గుతూ..
అప్పటినుంచి సీఎం కేసీఆర్ దగ్గర కేకే ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేగాక, అనారోగ్య కారణాలతో కేశవరావు కొన్నాళ్లూ ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం కోలుకున్నా.. పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో గానీ.. అంతర్గత సమావేశాల్లోగానీ ఆయన కీరోల్ పోషించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
డీఎస్ కూడా అంతే..
ఇది ఇలావుంటే. కాంగ్రెస్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన నేత ధర్మపురి శ్రీనివాస్ విషయం కూడా ఇలాగే మారిందని తెలుస్తోంది. సుదీర్ఘకాలం హస్తం పార్టీలో పనిచేసిన ఆయన.. సొంత పార్టీ రాజకీయాలకు తట్టుకోలేక ఆయన కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పార్టీలోకి ఆయన వచ్చీ రాగానే ప్రభుత్వ సలహాదారుగా నియమించారు కేసీఆర్.. ఆ తర్వాత రాజ్యసభ సీటును కూడా కట్టబెట్టారు.
ఆ రెండు వ్యవహారాలే...
టీఆర్ఎస్ పార్టీలో డీఎస్ వ్యవహారం సజావుగానే ఉన్నా.. కాంగ్రెస్లోకి తిరిగి ఆయన చేరబోతున్నారంటూ సాగుతున్న ప్రచారం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత డీఎస్ వివరణ ఇచ్చుకున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు తెలిసింది. దీనికితోడు.. ఆయన కుమారుడు అరవింద్ బీజేపీ గూటికి చేరిపోవడం డీఎస్ను డిఫెన్స్లో పడేసిందంటూ చర్చ సాగుతోంది. దీంతో ఆయన మరోసారి కేసీఆర్కు వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది.
ఇబ్బందులు కొనితెచ్చుకున్నారా?
ఈ పరిస్థితులలో డీఎస్ను కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. టీఆర్ఎస్లో చేరిన ఈ సీనియర్ నేతలు అనుకోని చిక్కుల్లో పడి.. ఇలా ఇబ్బందులు కొనితెచ్చుకోవడం గమనార్హం. టీఆర్ఎస్ అధిష్టానానికి అండగా ఉంటూ, కీలక నేతలుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు అనుకోని పరిణామాలతో దూరం అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, భవిష్యత్లో వారికి కేసీఆర్ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.