మరొకరితో చనువుగా ఉంటోంది, జీర్ణించుకోలేకపోయా.. అందుకే దివ్యను హత్యచేశా, విచారణలో వెంకటేశ్..
బ్యాంకు ఉద్యోగి దివ్యను హత్య చేసింది వెంకటేశ్ అని పోలీసులు ప్రకటించారు. మరో అబ్బాయితో చనువుగా ఉంటుందనే కారణంతో దివ్యపై వెంకటేశ్ కక్ష పెంచుకున్నారని పోలీసులు తెలిపారు. బ్యాంకు ఉద్యోగం రావడం, ఈ నెల 26వ తేదీన పెళ్లి చేసుకోబోతుండటంపై రగిలిపోయాడు. ఎలాగైనా మట్టుబెట్టాలనే మంగళవారం సాయంత్రం ప్రణాళిక ప్రకారం హత్య చేశాడని పోలీసులు వివరించారు.
కత్తితో మెడపై నరికి..
డాబాపై ఉన్న దివ్య మెడపై నరికాడని.. తర్వాత 15 పోట్లు పొడిచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత నిందితుడు వెంటకేశ్ విజయవాడ పారిపోయాడని పోలీసులు వివరించారు. మంగళవారం సాయంత్రం హత్య జరిగిన తర్వాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హత్యపై దివ్య తల్లిదండ్రులు వెంకటేశ్పైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కేసు విచారణ వెంకటేశ్ లక్ష్యంగా చేసుకొని జరిపారు. అందుకు తగ్గట్టు వేములవాడలోని వెంకటేశ్ ఇల్లుకు తాళం ఉండటం, అతని మొబైల్ పనిచేయకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
ఫస్ట్ పేరెంట్స్.. తర్వాత వెంకటేశ్..
వెంకటేశ్ పేరెంట్స్ పరశురాం-మల్లిశ్వరీని బుధవారం సాయంత్రం రాజన్న సిరిసిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దివ్యకు వెంకటేశ్కు మూడేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని పరశురాం తెలియజేశారు. నిందితుడు వెంకటేశ్ కోసం ఐదు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలించాయి. బుధవారం సాయంత్రం అతడిని పట్టుకొన్నాయి. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారించారు. మరొకరితో చనువుగా ఉండటం, పెళ్లికి సిద్ధమవడంతోనే ఓర్చుకోలేకపోయానని వెంకటేశ్ పోలీసుల విచారణలో తెలిపాడు. తానే హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించాడు.
ప్రేమ పెళ్లి నుంచి దూరం దూరం..
దివ్య-వెంకటేశ్ ఇంజినీరింగ్ చదివే రోజుల్లో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. దివ్య స్వస్థలం ఎల్లారెడ్డిపేట కాగా.. వెంకటేశ్ నెటివ్ వేములవాడ. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. మూడేళ్ల కింద యువతి పేరెంట్స్ పెళ్లైంది కదా అని వదిలి వెళ్లిపోయారు. తర్వాత దివ్యకు ఓయూలో సీటు వస్తే తానే చదివించానని పరశురాం తెలిపారు. తమ కుమారుడు దిల్షుఖ్నగర్లో ఉన్నారని గుర్తుచేశారు. ఏడాదిన్నర నుంచి దూరంగా ఉన్నారని.. అంతకుముందు కలిసే ఉండేవారని తెలిపారు. ఐదారునెలల నుంచి వారి మధ్య ఫోన్ సంభాషణలు పూర్తిగా తగ్గాయని తెలియజేశారు.