గణేష్ మంటపాల్లో డీజేలు పెడితే కఠిన చర్యలే..! నిబంధనలు జారీ చేసిన సీపీ..!!
హైదరాబాద్ : నగరంలో వినాయకుడు కొలువు దీరాడు. ప్రధాన రహదారులన్నీ వినాయ విగ్రహాలతో కాంతులీనుతున్నాయి. లంబోదరుడిని తాము ఏర్పాటు చేసిన మంటపాల్లో కొలువుదీరేలా చేసి నవరాత్రులు భక్తి ప్రపత్తులతో కొలిచేందుకు నగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం గణేష్ మంటపాలను ఏర్పాటు చేయడం, అద్బుతంగా అలంకరించడం, మిరుమిట్లు గొలిపే లైటింగ్ ను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల్లో నగర యువత నిమఘ్నమైనట్టు తెలుస్తోంది. ఐతే వినాయక మంటపాల నిర్వాహకులకు పోలీసు శాఖ కొన్ని నిబంధనలను రూపొందిస్తోంది. స్థాయికి మించి సౌండ్ పొల్యూషన్ కు పాల్పడటం, అసభ్య నృత్యాలు చేయడం, బలవంతపు చందాలు వసూలు చేయడం వంటివి అంశాలపై కఠిన చర్యలు ఉంటాయని నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేస్తున్నారు.
నగరానికి చవతి శోభ..! కొలువుదీరనున్న వినాయకుడు..!!
నగరానికి వినాయక చవితి శోభ వచ్చేసింది. ఏ కాలనీ చూసినా గణేష్ మంటపాల ఏర్పాట్లతో కళకళలాడుతున్నాయి. కాగా వినాయక మంటపాల నిర్వహకులకు కొన్ని షరతులు విధిస్తున్నారు పోలీసులు. ప్రశాంత వాతావరణంలో హైదరాబాద్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. గణేశ్ వేడుకల సందర్భంగా 21వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నగరంలో కొలువు దీరుతున్న గణేష్ మంటపాల నిర్వాహకులకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసారు.
భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ..! నియమాలు కూడా పాటించాల్సిందే..!!
నిమజ్జనానికి వెళ్లే వాహనాలకు కలర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో నుంచి హుస్సేన్సాగర్కు వచ్చే వాహనాలకు కూడా వారు కోరితే కోడ్ ఇస్తామన్నారు. చిన్న విగ్రహాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కోరారు. నిమజ్జనోత్సవానికి వెళ్లే సమయంలో వాహనాలపై అధిక బరువులు వేస్తూ ఓవర్ లోడ్తో వాహనాలు వెళ్తుంటాయని, అందులో పిల్లలు, పెద్దలు భారీగా ఉంటారని తెలిపారు. ఓవర్లోడ్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, వాహనాల్లో పిల్లలు వెళ్లే సమయంలో ఆ వాహనంలో ఎంత మంది ఉన్నారనే విషయాన్ని కూడా ప్రతి తల్లిదండ్రులు, పెద్దలు గమనించాలన్నారు.
మార్గదర్శకాలు విడుదల చేసిన పోలీసు శాఖ..! అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న నగర కమీషనర్..!!
అంతే కాకుండా ప్రతి మండపం వద్ద పోలీసులు ఉంటారన్నారు. డీజేలు వద్దని సూచించారు. హైదరాబాద్ సిటీలో మండపాల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుందన్నారు, ఇప్పటి వరకు 7వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. అందరూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల అన్ని రకాలైన అనుమతులు, పోలీసుల నుంచి పూర్తి సమాచారం, ఇతర సౌకర్యాలు బాగుంటాయని సీపీ సూచించారు. ప్రతి మండపం వద్ద నుంచి 15 మంది వరకు వలంటీర్లుగా తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారని, మరింత మంది తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
డీజే సౌండ్ లు వద్దు..! ప్రశాంత చవితి వేడుకలకు సహకరించాలంటున్న సీపి..!!
డీజేలు ఉపయోగించవద్దని, డీజేలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో బలవంతపు చందాలు వసూళ్లపై ఫిర్యాదులు అందాయని, ఎవరైనా బలవంతపు చందాలు వసూలు చేస్తే వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారని ప్రజలకు సూచించారు. హైదరాబాద్లో అన్ని వర్గాల వారున్నారని, ఒకరి పండుగలను మరొకరు గౌరవించుకుంటూ గంగ జమున తెహజీబ్గా కలిసిపోతున్నారన్నారు. అంతే కాకుండా గణేష్ నవరాత్రులు ముగిసే వరకు అందరూ సహనంతో ఉండాలని, ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ సోదరభావంతో మెలగాలని సీపి సూచనలు చేసారు.