కేసీఆర్.. పాలమూరులో వలసలు లేవా? కవిత విషయంలో వెనకడుగు దేనికి? డీకే అరుణ ఎటాక్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని కేంద్రంలోని బిజెపి సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాలమూరు జిల్లా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలు అంటూ మండిపడ్డారు. కెసిఆర్ తన పాలనలో పాలమూరు జిల్లాలో వలసలు లేవని చెబుతున్నారని, ఇక ఈ విషయంలో తమతో కలిసి పాలమూరు జిల్లాలో తిరిగే దమ్ముందా అంటూ డీకే అరుణ సవాల్ విసిరారు.
వాల్మీకి బోయ్లను ఎస్టీలలో చేర్చాలని మీరు చేసిన తీర్మానం బయట పెట్టండి : డీకే అరుణ
వాల్మీకి బోయలను ఎస్టీలలో చేర్చాలని కేంద్రానికి పంపినా కేంద్రం పట్టించుకోలేదని చెబుతున్న కేసీఆర్, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం పంపిన పత్రాన్ని విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు తన కూతురిని మద్యం కేసు నుంచి ఎలా తప్పించాలి అన్న ఆలోచన తప్ప తెలంగాణ అభివృద్ధి పై ఆలోచన లేదని డి.కె.అరుణ విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని, ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని డీకే అరుణ ఆరోపించారు.
పాలమూరు వలసలపై తమతో కలిసి పర్యటించే దమ్ముందా?
ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేని కేసీఆర్ కేంద్రం అడ్డుకుంటున్నది అంటూ అసత్య ప్రచారం చేసి, కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కాళ్ళు అడ్డుపెట్టటం లేదని, కెసిఆర్ అసమర్థ తో, అవినీతితో తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని డీకే అరుణ ఆరోపించారు. పాలమూరు జిల్లాలో గతంలో వలసలు ఉండేవని, ఇప్పుడు లేవని చెప్పిన కేసీఆర్ కు వలసలు ఉన్నాయో లేవో చూడడం కోసం తమతో కలిసి పర్యటించే దమ్ముందా అంటూ డీకే అరుణ సవాల్ విసిరారు. పాలమూరు జిల్లాలో వలసలు లేవని చెప్పడం సిగ్గుచేటని డీకే అరుణ మండిపడ్డారు.
అవినీతికి పాల్పడితే సొంత బిడ్డయినా విడిచిపెట్టనన్న కేసీఆర్ కవిత విషయంలో చేసిందేంటి?
అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నర ఏళ్లు గడుస్తున్నా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది అంటే దానికి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే కారణమని డీకే అరుణ ఆరోపించారు. అవినీతికి పాల్పడితే సొంత బిడ్డను కూడా విడిచిపెట్టనని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు తన కూతురు విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డి గురించి సీఎం కేసీఆర్ గొప్పగా మాట్లాడుతున్నారని, దీనిని బట్టి టీఆర్ఎస్ పార్టీ నేతల అవినీతిని ఆయన ప్రోత్సహిస్తున్నట్టు అర్ధమవుతోంది అని డీకే అరుణ ఆరోపించారు.