నీకు తెల్సు: హరీష్కు అరుణ, వరంగల్లో మీరాకుమారిపై తర్జన భర్జన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల పైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డికె అరుణ మంగళవారం నాడు స్పందించారు. రాయలసీమ నేతలకు హారతి పట్టింది ఎవరో ఆ వ్యాఖ్యలు చేసిన వారికే తెలుసునని చెప్పారు.
హరీష్ రావు వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ఆరోపణలు చేసే ముందు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. కాగా, హరీష్ రావు సోమవారం టిడిపి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత నేతల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే.
మహబూబ్ నగర్ నీటిని సీమాంధ్ర నేతలు తరలించుకుపోతుంటే, అనంతపురం జిల్లాలో నాటి మంత్రి డికె అరుణ హారతి పట్టారని ఆరోపించారు. అలాగే, పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడుతున్న చంద్రబాబు పార్టీ అయిన టిడిపికి తెలంగాణలో చోటు లేకుండా చేయాలన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలకు అరుణ స్పందించారు.
విఫలమయ్యారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన సిఎం కెసిఆర్, స్పీకర్ మధుసూదనా చారి, గవర్నర్ నరసింహన్లు విఫలమయ్యారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరుగా అన్నారు. ఆయన వరంగల్ జిల్లాలో మాట్లాడారు. వరంగల్ లోకసభ ఎన్నికపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరంగల్ లోకసభ స్థానం నుండి మాజీ లోకసభ స్పీకర్ మీరా కుమారిని దింపాలన్నది కేవలం కొందరు నేతల ప్రతిపాదననే అని, దానిని అధిష్టానం పరిశీలిస్తుందని చెప్పారు.
ప్రతిపక్షాలు, మేధావులు, మీడియా పట్ల కెసిఆర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను ఆమోదించక పోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా తలసానిని కేబినెట్ నుంచి తప్పించాలన్నారు.