బీజేపీ ఆపరేషన్ 2023..తెలంగాణలో అధికారం లక్ష్యంగా..డీకే అరుణ , డా.కే లక్ష్మణ్
భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడంతో, జాతీయ కార్యవర్గంలో చోటుదక్కిన తెలుగు రాష్ట్రాల నాయకులు, పార్టీని బలోపేతం చేయడానికి దృష్టి సారిస్తామని చెబుతున్నారు. బిజెపిని 2023 ఎన్నికల్లో గెలిపించి, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం .. బీజేపీని బలోపేతం చేస్తాం
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన వారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తామని తెలియజేశారు.రాష్ట్రంలో బీజేపీని 2023 లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా జాతీయ పార్టీ, జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణకు పట్టం కట్టింది. దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని, అమలు చేస్తున్న పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామని డీకే అరుణ పేర్కొన్నారు.
బీజేపీని అధికారంలోకి తేవటమే లక్ష్యం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, ప్రజలకు మరింత చేరువ కావడానికి నిరంతరంగా పనిచేస్తామని డీకే అరుణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీదే అధికారం అని డీకే అరుణ స్పష్టం చేశారు. ఆ దిశగా తమ కార్యాచరణ ఉంటుందని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా జాతీయ కమిటీలో స్థానం దక్కడంతో జాతీయ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బిజెపి తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ .
2023ఎన్నికలు టార్గెట్ గా పని చేస్తాం
తెలంగాణ ఏపీ లో 50 శాతం ఉన్న బీసీ సామాజిక వర్గాలను పార్టీకి సేవ చేస్తానని పేర్కొన్నారు. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాలలో ఓ బి సి లు పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా కృషిచేస్తానని తెలిపారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదానికనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం ధ్యేయంగా పని చేస్తామని, రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆ దిశగా పనిచేస్తుంది అని చెప్పిన డాక్టర్ కే లక్ష్మణ్ తన వంతు తోడ్పాటును అందిస్తానని చెప్పారు.
Recommended Video
తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగటం కోసం వ్యూహాత్మకంగా బీజేపీ
ఇప్పటికే రాష్ట్రంలో బండి సంజయ్ కు తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు అప్పజెప్పిన నాటి నుండి రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతుంది. ప్రభుత్వ విధానాలపై సమరం చేస్తుంది . ఇప్పుడు జాతీయ కమిటీలో కూడా తెలంగాణా రాష్ట్రానికి చోటు కల్పించటంతో బీజేపీ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే ఆలోచనలో ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దె దించటమే లక్ష్యంగా పని చెయ్యాలని భావిస్తున్నారు బీజేపీ నాయకులు .